ఆఫ్ఘనిస్తాన్ను ఆహ్వానించిన ఐక్యరాజ్య సమితి: సర్వసభ్య సమావేశంలో తాలిబన్ల ప్రసంగం
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ ప్రసంగంతో ఈ ఈ సమావేశాలు ఆరంభం అయ్యాయి. వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఈ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది.
ఆఫ్ఘన్కు ఆహ్వానం..
ఇలా అన్ని దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొంటారు. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకుని మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న తాలిబన్లకు కూడా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా ఆప్ఘనిస్తాన్ను ఆహ్వానించింది. సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించాల్సిందిగా సూచించింది. ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు తాలిబన్లు సర్వసభ్య సమావేశాలకు హాజరు కానున్నారు.
ఐరాసకు ఆప్ఘనిస్తాన్ లేఖ
తమ తరఫున అంబాసిడర్ను కూడా ఎంపిక చేశారు. 26 లేదా 27వ తేదీల్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి తాలిబన్ అంబాసిడర్ ప్రసంగిస్తారు. ఖతర్కు చెందిన తమ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ను అంబాసిడర్గా ప్రకటించారు తాలిబన్లు. సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రిగా నామినేట్ అయిన అమీర్ ఖాన్ ముత్తాకీ ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెర్రస్కు లేఖ రాశారు.
ఆ విజ్ఞప్తి మేరకే
ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి నుంచి తమకు లేఖ అందిన విషయాన్ని గ్యుటెర్రస్ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ నిర్ధారించారు. తాలిబన్లు చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూల నిర్ణయాన్ని తీసుకున్నామని, సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాన్ని పంపించామని చెప్పారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో ఐక్యరాజ్య సమితిలో ఆప్ఘనిస్తాన్ రాయబారిగా గులామ్ ఇసాక్జై పని చేశారు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఆయన తన పదవి నుంచి వైదొలిగారు.
క్రెడెన్షియల్ కమిటీ ఏర్పాటు..
అష్రఫ్ ఘనీ స్థానంలో కొత్తగా ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నందున తమకు సభ్యత్వాన్ని కల్పించాల్సిందిగా గులామ్ ఇసాక్జై ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి అనుగుణంగా తాము నిర్ణయం తీసుకున్నామని హక్ స్పష్టం చేశారు. సభ్యత్వం కోసం అమెరికా, చైనా, రష్యాతో కూడిన తొమ్మిదిమంది సభ్య దేశాల ప్రతినిధులతో ఓ క్రెడెన్షియల్ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వచ్చే వారం భేటీ అవుతుందని అన్నారు. సర్వసభ్య సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఈ కమిటీ సమావేశం కాబోదని హక్ తెలిపారు.
రాయబారికి మాత్రమే ఛాన్స్..
ఈ క్రెడెన్షియల్ కమిటీ భేటీ ముగిసిన తరువాతే ఆఫ్ఘనిస్తాన్ను సభ్యత్వాన్ని ఖరారు చేస్తామని, అందుకే- ఆ దేశ ప్రధానమంత్రికి గానీ, విదేశాంగ మంత్రికి గానీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించే అవకాశం దక్కలేదని చెప్పారు. ఆ అవకాశం రాయబారికి మాత్రమే కల్పించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ క్రెడెన్షియల్ కమిటీ భేటీ ఏర్పాటయ్యే సమయానికి సర్వసభ్య సమావేశాలు ముగుస్తాయని పేర్కొన్నారు. అయినప్పటికీ- తాలిబన్లు రాయబారి సుహైల్ షహీన్ ద్వారా తమ గళాన్నివినిపించబోతోన్నారు.
Recommended Video
తాలిబన్లు ఏం మాట్లాడతారు?
ఎలాంటి అంశాన్ని ఆప్ఘనిస్తాన్ ప్రస్తావిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ పట్ల వ్యతిరేక భావాన్ని కనపరుస్తోన్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రజల పట్ల తమ సానుభూతిని, మానవతా దృక్పథాన్ని కనపరుస్తూనే తాలిబన్లకు మద్దతు ఇవ్వట్లేదు. తాలిబన్ ప్రభుత్వ హయాంలో ఆప్ఘనిస్తాన్ మళ్లీ ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా మారుతుందనే భయాందోళనలు ఆయా దేశాల్లో వ్యక్తమౌతోన్నాయి.