ఘోర పడవ ప్రమాదం: 131మంది మృతి, 150మందికిపైగా గల్లంతు
టాంజానియా: ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 131 మంది ప్రాణాలు కోల్పోగా.. 150మందికి పైగా గల్లంతయ్యారు.
లేక్ విక్టోరియాలో ప్రయాణిస్తున్న పడవ కొద్దిసేపట్లో రేవుకు చేరుకుంటుందనగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం నుంచి 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. పడవ సామర్థ్యం వంద సీట్లు కాగా.. అందులో 400 మంది ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది.
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పడవ రేవు సమీపానికి చేరుతుందనగానే ప్రయాణికులంతా ఒకవైపునకు వచ్చారు. దీంతో పడవ ఒకవైపునకు ఒరిగిపోయి బోల్తా పడి నెమ్మదిగా మునిగిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.