సిడ్నీకి బాంబు బెదిరింపులు: కుర్రాడి అరెస్టు
మెల్ బోర్న్: బాంబులు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడిన ఓ కుర్రాడిని మెల్ బోర్న్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మంగళవారం మెల్ బోర్న్ పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్ లో బాంబు ఉందంటూ ఒకరు గత గురువారం సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే సిడ్నీ ఒపెరా హౌస్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బాంబు నిర్వీర్య దళం బృందాలు మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబులు కనపడక పోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. చివరికి కేసు నమోదు చేసి బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి కోసం గాలించారు.
బాంబు బెదిరింపులు చేసింది 17 ఏళ్ల కుర్రాడు అని సోమవారం అధికారులు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23వ తేదిన బాలల కోర్టు న్యాయమూర్తి ముందు అతనిని హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
సిడ్నీ ఒపెరా హౌస్ కు బాంబు బెదిరింపులు వచ్చిన రోజే న్యూ సౌత్ వెల్ప్ ప్రాంతంలోనూ బాంబులు ఉన్నాయని బెదిరింపులు వచ్చాయి. అయితే అక్కడా ఎలాంటి బాంబులు, పేలుడు పదార్థాలు చిక్కలేదని పోలీసు అధికారులు తెలిపారు.