Coronavirus:ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు..సహాయం చేయాల్సిందిగా వీడియో సందేశం
మిలాన్ / ఇటలీ: చైనాలో వెలుగు చూసిన కరోనావైరస్ ఆ ఒక్కదేశాన్నే కాకుండా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనావైరస్తో చాలా దేశాల ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. ఇక చైనా తర్వాత కరోనావైరస్తో అత్యంత ఎక్కువగా మరణాలు నమోదైన దేశం ఇటలీ. ఇటలీలో ఇప్పటికే 36శాతం మరణాలు పెరిగాయి. ఇటలీలో ఇప్పటి వరకు 631 మంది కరోనావైరస్తో మృతి చెందినట్లు సమాచారం. ఇక చైనాలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాలు పంపించి కేంద్రప్రభుత్వం భారత్కు తీసుకువచ్చింది. అయితే ఇటలీలో మాత్రం చాలామంది భారతీయులు అందునా తెలుగువారు చిక్కుకుపోయి ఉన్నారు.
ఇటలీలో శరవేగంగా కరోనావైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి 631 మంది మృతి చెందారు. భారత్లో పర్యటిస్తున్న చాలామంది ఇటలీ పర్యాటకుల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇక తాజాగా ఇటలీని వణికిస్తున్న కరోనావైరస్ ధాటికి తెలుగు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారత్కు తిరిగి సొంత ఊళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి వ్యధ వర్ణించలేనిదిగా ఉంది.
అక్కడే విమానాశ్రయంలో ఇరుక్కుపోయిన విద్యార్థులు తమను భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్రప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ వీడియో విడుదల చేశారు. మిలాన్ ఎయిర్పోర్టులో తామంతా చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఇటలీలో కరోనావైరస్కు కేంద్రబిందువు మిలాన్ అని వారు చెప్పారు. ఇప్పటికే అక్కడ నగరాలన్నీ నిర్మనుష్యంగా మారడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేసుకున్నట్లు విద్యార్థులు చెప్పారు.
ప్రభుత్వం మార్చి 10వ తేదీ తర్వాత భారత్కు వచ్చే ప్రయాణికులందరూ కోవిడ్-19 సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఆదేశించిందని అయితే తమకు ఎవ్వరికీ కరోనా టెస్టుల్లో పాజిటివ్ రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఎయిరిండియా విమానాయాన సంస్థ మాత్రం వారిని విమానం ఎక్కేందుకు అనుమతించడం లేదని తమ బాధను చెప్పుకున్నారు విద్యార్థులు.
అంతేకాదు తదుపరి ప్రక్రియ ఏంటో కూడా ఎయిరిండియా సంస్థ చెప్పడం లేదని, టికెట్లు డబ్బులు వెనక్కు చెల్లిస్తారా లేక మరేమైనా చేస్తారా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదని వెల్లడించారు. ప్రయాణికులకు సరైన అవగాహన లేదని చెప్పారు. విద్యార్థులకు డబ్బులు రీఫండ్ చేయకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారు అలానే ఉన్నారని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటలీ ఎంబసీకి ఫోన్ చేసినప్పటికీ అక్కడి నుంచి స్పందన లేదని చెప్పారు.
Recommended Video
ఎయిరిండియా నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పిన విద్యార్థులు తమకు ఏం చేయాలో పాలుపోవడం లేదని వెల్లడించారు. ఇప్పుడు తిరిగి బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తమ బాధను చెప్పుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని తమకు సహాయం చేయాలని విద్యార్థులు వేడుకున్నారు. మిలాన్ నుంచి ఒకే ఒక్క ఎయిరిండియా విమానం ఉంటుందని దానికే టికెట్లు బుక్ చేసుకోగా ఇప్పుడు వారు విమానం ఎక్కనివ్వలేదని విద్యార్థులు చెప్పారు.