ట్రంప్కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలు
ఎన్నికల ఫలితాల ఆలస్యం, పోలింగ్ పూర్తయిన మూడు రోజుల తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ నుంచే భారీ షాక్ తగిలింది. తాజాగా ఎన్నికైన రిపబ్లికన్ ప్రజాప్రతినిధులు సైతం ప్రెసిడెంట్ ఫాల్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. గెలవడానికి అవకాశం ఉండి కూడా పిచ్చి ప్రేలాపనలు ఎందుకు చేస్తున్నారంటూ మీడియా, సోషల్ మీడియా ముఖంగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలు
ఆజ్యం పోసిన ట్రంప్ కొడుకు..
ఎన్నికల ఫలితాలు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఆలస్యాన్ని నిరసిస్తూ, కౌంటింగ్ వెంటనే నిలిపేయాలంటూ ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ అనుచరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టులు కొట్టేశాయి. దీంతో ట్రంప్.. తన గురిని జడ్జిలపైకి తిప్పి.. దేశ పరిపాలనను న్యాయవ్యవస్థ తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటోందంటూ తీవ్ర ఆరోపణ చేశారు. వైట్ హౌజ్ సాక్షిగా ఆయన చేసిన ప్రసంగం లైవ్ ప్రసారాన్ని.. అమెరికాలోని ప్రధాన మీడియా ఛానెళ్లు మధ్యలోనే నిలిపేశాయి. ఎన్నికలపై ట్రంప్ తప్పుడు ఆరోపణలు, నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకే లైవ్ కట్ చేశామని ఛానెళ్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రిపబ్లికన్ నేతలందరినీ ఉద్దేశించి.. ‘ధైర్యంగా ప్రశ్నించడానికి అందరికీ వెన్నెముక ఉండాలి కదా'అని వ్యాఖ్యానించడం పార్టీలో విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది.
పిచ్చి ముదిరిందా.. ఏంటిది?
ప్రెసిడెంట్ ట్రంప్ లేవనెత్తిన అంశాలకు రిపబ్లికన్ పార్టీలోని నేతలందరూ మద్దతు పలకాలన్న ట్రంప్ జూనియర్ వ్యాఖ్యలు, అంతకు ముందు ట్రంప్ కామెంట్లపై పార్టీలో చీలిక ఏర్పడింది. ఇల్లినాయిస్ (11వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్) రిప్రెజెంటేటివ్, రిపబ్లికన్ పార్టీ కీలక నేత ఆడమ్ కింజింగర్.. ట్రంప్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కౌంటింగ్ ఆపేయాలనడం, పదే పదే తప్పుడు సమాచారాన్ని ఫైలాయించడాన్ని బట్టి చూస్తే ట్రంప్ కు పిచ్చి ముదిరినట్లుగా అనిపిస్తోంది. నిజంగా ఎన్నికల్లో ఏవైనా మోసాలుంటే, సంబంధిత ఆధారాలను కోర్టు ముందు ఉంచాలి. అంతే తప్ప ప్రజల చట్టబద్ధమైన ఓటు గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. ప్రతి ఓటునూ లెక్కించి తీరాల్సిందే'' అని ఆడమ్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికే ప్రమాదం..
రిపబ్లికన్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, ప్రస్తుత మిచిగన్ రాష్ట్ర 10వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ రిప్రెజెంటేటివ్ పాల్ మిచెల్ మరో అడుగు ముందుకేసి.. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ఫైరయ్యారు. ‘‘ఎప్పటిలాగే ఈసారి కూడా చట్టపరంగా వేసిన ప్రతి ఓటునూ లెక్కించాల్సిందే. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే దానిని బయటపెట్టాలి. అంతేకానీ, మొత్తం ఎన్నికల వ్యవస్థపైనే విమర్శలు చేస్తూ, సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం అమెరికా ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం''అని మిచెల్ అన్నారు.
వ్యక్తి ముఖ్యం కాబోడు..
మేరీ ల్యాండ్ రాష్ట్ర గవర్నర్, రిపబ్లికన్ నేత ల్యారీ హోగన్ సైతం ప్రెసిడెంట్ ట్రంప్ తీరును తప్పు పట్టారు. ‘‘ఒకవైపు కౌంటింగ్ కొనసాగుతోంది.. ఎప్పటిలాగే ఫలితాలను అందరం గౌరవించాలి. గెలుపు, ఓటములను నిర్ణయించేది ప్రజలే. ప్రజాస్వామ్యం కంటే ఎన్నికలు లేదా వ్యక్తి కాబోడు''అని ల్యారీ అన్నారు. ఇలా రిపబ్లికన్ పార్టీలోని చాలా మంది నేతలు ట్రంప్ దుందుడుకు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..
తుది ఫలితాలు మరింత ఆలస్యం..
శుక్రవారం మధ్యాహ్నం నాటికి మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ 264 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 214 ఓట్లు సాధించారు. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కొత్తగా మరిన్ని పోస్టల్ బ్యాలెట్లు వస్తుండటంతో తుది ఫలితాల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇంకా ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సాధించగలిగితే బైడెన్ మ్యాజిక్ ఫిగర్ (270)ని చేరడం, తద్వారా విజయం ఖరారైనట్లే. పూర్తి స్థాయి ఫలితాలు మాత్రం వచ్చేవారానికిగానూ వెలువడబోవని ఎన్నికల అధికారులు అంటున్నారు.
ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?