3వేల మంది విద్యార్థులున్న పాక్ వర్సిటీపై ఉగ్రదాడి: 20మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతమైన చర్సడా నగరంలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. పలువురు సాయుధులైన ఉగ్రవాదులు యూనివర్సిటీ క్యాంపస్లోకి చొరబడి పేలుళ్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు.
విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఓ ఈవెంట్ సందర్భంగా ప్రస్తుతం అక్కడ 3వేల మంది విద్యార్థులు, 600మంది అతిథులు కూడా ఉన్నారు. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ ప్రొఫెసర్ తోపాటు 20మంది విద్యార్థులు మరణించారు.
కాగా, భద్రతా దళాలు.. ఉగ్రవాదులుపై ఎదురుకాల్పులు జరుపుతున్నారు. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. దాదాపు 3గంటలకుపైగా ఈ ఆపరేషన్ కొనసాగింది. కాగా, ఉగ్రవాదులు వర్సిటీలో 10 బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన విద్యార్థులు, సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హెలికాప్టర్ సాయంతో రక్షణ చర్యలు చేపడుతున్నట్లు భద్రతాదళాధికారులు తెలిపారు.
ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో యూనివర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న దానిపై పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని పాక్ మీడియా తెలిపింది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు పాక్ మిలటరీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులంతా18 నుంచి 25 ఏళ్ల లోపు వారేనని పేర్కొన్నారు.
కాగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను రక్షించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్ సయీద్ వజీర్ వెల్లడించారు. ఉగ్రదాడితో భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. కాగా, యూనివర్శిటీలో దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్-ఇ-తాలిబన్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
గతంలో పెషావర్లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి సుమారు 150మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది మృతికి కారణమయ్యారు.