పాక్: వరుస పేలుళ్లకు తెగబడ్డ ఉగ్రవాదులు, 13మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఉగ్రవాదులు మరోసారి దాడులతో తెగబడ్డారు. స్థానిక క్రిష్టియన్ కాలనీలో శుక్రవారం ఉదయం పౌరులే లక్ష్యంగా ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.
సమాచార మందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి.భద్రతా బలగాల కాల్పుల్లో మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రదాడిలో గాయపడిన వారిని సహాయ బృందాలు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.
మరో రెండు పేలుళ్లు
పెషావర్లో ఉగ్రదాడి జరిగిన కొద్ది గంటలకే పాకిస్థాన్లో మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మార్దాన్ కోర్టు వద్ద శుక్రవారం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.
స్థానిక న్యాయస్థానం గేటు వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి. సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
తొలుత ఓ వ్యక్తి బాంబును విసిరి, అనంతరం కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అనంతరం మరో వ్యక్తి గేట్ ప్రాంగణంలో తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలిపారు.