కోరలు చాచిన ఉగ్రవాదం..! కోలుకోని లంక..!!
కొలంబో/హైదరాబాద్ : ఈస్టర్ పర్వదినం రోజున నెత్తురోడిన శ్రీలంక వారం రోజులు గడిచినా ఇంకా తేరుకోలేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. శనివారం ఒక పట్టణంలో సోదాలు జరుపుతుండగా భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు ఆత్మాహుతి దాడికి పాల్పడటం, మరో 15మంది మరణించడం చూస్తే ఆ దేశంలో ఉగ్రవాదం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్ధమవుతుంది.
ఉగ్ర గాయం..! తేరుకోని చిరు దేశం..!!
సుదీర్ఘకాలం విధ్వంసాలు, ఊచకోతలు చవిచూసిన దేశంలో భద్రతా బలగాల, నిఘా సంస్థల కన్నుగప్పి ఉగ్రవాద సంస్థలు భారీయెత్తున బాంబులు, మారణాయుధాలు పోగేసు కోవడం... స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఊహకందనిది. వరసగా 26 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా లంకలో సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమిళ టైగర్లు సాగించిన ఆత్మాహుతి దాడులు, కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని సాగించిన మారణకాండ ఆ దేశాన్ని ఊపిరాడనీయకుండా చేశాయి.
ఇంకా అస్తవ్యస్థంగానే..! గాడిన పడని శ్రీలంక పాలన..!!
అదంతా పదేళ్లక్రితం మాట. ఆ దాడులకు కారణమైన తమిళ టైగర్ల సంస్థ ఎల్టీటీఈ అక్కడే పుట్టి పెరిగి విస్తరించింది. సింహళ జాతీయతను రెచ్చగొట్టి, మైనారిటీలుగా ఉన్న తమిళ సంతతి ప్రజలపై వివక్ష అమలు చేయడంతో రేగిన అసంతృప్తి క్రమేపీ ఉద్యమ రూపం ధరించి స్వయంపాలన అడిగేవరకూ వెళ్లింది.
తనిఖీల్లో బయటపడుతున్న బాంబులు..! ఉలిక్కిపడుతున్న ప్రజలు..!!
తమిళ ఉద్యమ సంస్థలు లేవనెత్తిన అంశాలను చక్కదిద్దేందుకు శ్రీలంకలోని ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ పెట్టని కారణంగా అది సాయుధ పోరాటాన్ని విశ్వసించే ఎల్టీటీఈ తదితర సంస్థల ఆవిర్భావానికి దోహదపడింది. కానీ ఇప్పుడు ఉగ్రవాద ఉదంతాల మూలాలు వేరు. మతపరమైన విశ్వాసాలు కాస్తా విద్వేషంగా రూపుదిద్దుకోవడం, ఆ విద్వేషం అంతిమంగా ఉన్మత్త స్థితికి చేరడం తాజా దాడుల్లో కనబడుతుంది.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం..! ఏమారుపాటుగా ఉంటే మళ్లీ ప్రమాదమే..!!
లంక దాడులకు పాల్పడిన ముఠాలకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొందరు తోడ్పాటును అందించారని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. పేలుళ్ల సూత్రధారి కోయంబత్తూర్ వచ్చివెళ్లారని ఆ కథనాలు అంటున్నాయి. ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం కూడా ఉంది.