భారతీయులు, ఆఫ్ఘన్లు లక్ష్యంగా ఉగ్రదాడులకు ఛాన్స్: అమెరికా వార్నింగ్.. !
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు, ఆఫ్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని లష్కరె తొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అమెరికా హెచ్చరించింది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి యథేచ్ఛగా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తోన్న ఈ రెండు సంస్థల కదలికలు ఏడాది కాలం నుంచీ అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. భారతీయులు, ఆఫ్ఘన్లు ఎక్కడ ఉన్నా.. వారిని, ఆస్తులను టార్గెట్ గా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత ఈ రెండు సంస్థల కార్యకలాపాలు మరింత ముమ్మరం అయ్యాయని, పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకుంటోదని తన నివేదికలో స్పష్టం చేసింది. ఉగ్రవాదులు, కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల కదలికలను అక్కడి ప్రభుత్వం నియంత్రించిన తరువాత.. ఆఫ్ఘనిస్తాన్ పై పగ తీర్చుకోవాలనే కసి లష్కరె తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్లో కనిపిస్తోందని అభిప్రాయపడింది.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ అండ్ హక్కాని నెట్ వర్క్ ప్రస్తుతం పాకిస్తాన్ కేంద్రంగా తమ పని చేస్తోందని, చాపకింద నీరులా ఆఫ్ఘనిస్తాన్ లో తన నెట్ వర్క్ ను విస్తరించుకుంటోందని స్పష్టం చేసింది. లష్కరె తొయిబా, జైషె మహమ్మద్, హక్కాని నెట్ వర్క్ లకు పాకిస్తాన్ లో విస్తారమైన ఆర్థిక వనరులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి ద్వారా మరింత బలోపేతమౌతున్నాయని వెల్లడించింది. మున్ముందు ఈ మూడు సంస్థలు భారత్, ఆఫ్ఘనిస్తాన్ లో దాడులకు పాల్పడానికి అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఈ రెండు దేశాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.