కరోనా బాంబులుగా ఉగ్రవాదులు... వార్నింగ్ ఇస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది . దాదాపు సంవత్సర కాలంగా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా మహమ్మారిని నివారించడం కోసం, నియంత్రించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ లు విధించినా , సామాజిక దూరం పాటిస్తున్నా కూడా కరోనా కట్టడి సాధ్యం కాలేదు. ఇక తాజాగా కొన్ని ప్రమాదకర శక్తులు కరోనాను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
కరోనాతో మానవ సమాజానికి హాని చేసే పనిలో ఉగ్రవాదులు
ఒకప్పుడు బాంబులతో దాడి చేసి విధ్వంసం సృష్టించి, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసిన ఉగ్రవాదులు, ఇప్పుడు కరోనాతో చంపేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు గా సమాచారం. అల్ ఖైదా , ఐఎస్ఐఎస్ తదితర ఉగ్రవాద సంస్థలు కరోనా విజృంభణ ఆసరాగా చేసుకుని, కుట్రలకు తెగ పడుతున్నారని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజినల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండడం అవసరం అంటూ హెచ్చరిస్తోంది.
కరోనా జీవ బాంబులుగా తయారు కావాలని ఉగ్ర సంస్థల ఆదేశం
కరోనా మహమ్మారిని ఆయుధంగా మార్చుకుని విధ్వంసం సృష్టించే ప్రయత్నాల్లో తీవ్రవాద సంస్థలు ఉన్నట్లుగా యుఎన్ఐసిఆర్ఐ హెచ్చరికలు జారీ చేస్తోంది. జీవ బాంబులు గా తయారయ్యేందుకు ఆయా సంస్థల సభ్యులు కావాలని కరోనాను సోకేలా చేసుకుంటున్నారని, కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అయిన తర్వాత వారు వివిధ ప్రదేశాలకు వెళ్ళి బహిరంగంగా తుమ్మడం, దగ్గటం వంటి చర్యలకు పాల్పడడం కోసం తీవ్రవాద సంస్థలు వారిని ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది.
Recommended Video
సామాజిక మాధ్యమాల ద్వారా ఆదేశం .. కావాలని కరోనా సోకించుకుని మరీ దాడి
ఉగ్రవాద సంస్థలు తమ నెట్ వర్క్ ను బలోపేతం చేయడం కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ కరోనా బాంబులుగా తయారు కావాలని సూచిస్తున్నట్లుగా అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. కరోనా బాంబులుగా తయారైన ఉగ్రవాదులు జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలలో తుమ్మలతో , దగ్గులతో కరోనా వ్యాప్తి చేసే అవకాశం ఉన్నట్లుగా, తద్వారా మానవులకు హాని చెయ్యనున్నట్టు సమాచారం. కరోనా బాంబులుగా ఉగ్రవాదులు మారి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలే కరోనా మహమ్మారి తో జనజీవనం అతలాకుతలం అవుతున్న వేళ, ఉగ్రవాదులు కూడా కరోనాను ఆయుధంగా మార్చుకోవడం ఆందోళన కలిగిస్తుంది.