పాకిస్థాన్ పై మరోసారి ఉగ్రదాడి : ఫైవ్ స్టార్ హోటల్ పై అటాక్, కొనసాగుతున్న కాల్పులు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బలోచిస్తాన్ గ్వాదర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాడి చేశారు. నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది.
బాంబుల మోత ..
హోటల్ నుంచి భారీగా బాంబు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రాణనష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.
రంగంలోకి బలగాలు
హోటల్ మీద ఉగ్రదాడి జరిగిన వెంటనే ఏటీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భారీ ఎత్తున భద్రతా దళాలను హోటల్ బయట మోహరించాయి. టెర్రరిస్టులు రాకెట్ లాంచర్లు పట్టుకుని ఉన్నారని, ఆత్మాహుతి కోసం జాకెట్స్ కూడా ధరించారని సమాచారం. హోటల్లోని అందరు అతిథులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేసినట్టు బలోచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బిలాడీ చెప్పారు. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు మంత్రి జహూర్ బిలాడీ తెలిపారు.
ఆ వెంటనే ..
దాదాపు 12 ఉగ్రవాసద సంస్థల నిషేధిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉగ్ర దాడి జరిగింది. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న 12 సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. అందులో జైషే మహ్మద్ కూడా ఉంది.