శ్రీలంకలో పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు భారత్లో శిక్షణ పొందారు: లంక ఆర్మీ చీఫ్
శ్రీలంకలో ఉగ్రదాడులపై ఆ దేశ ఆర్మీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు ముందు వారు భారత్లోని కశ్మీర్, బెంగళూరు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారని అన్నారు. ఆ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ మహేష్ సేననాయకే ఈ విషయాలను చెప్పారు. అయితే వారు ఎందుకు భారత్కు వెళ్లారో అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. భారత్లో శిక్షణ పొందేందుకు వెళ్లారా అన్న అనుమానం వ్యక్తమవుతోందని మహేష్ సేననాయకే చెప్పారు.
భారత్తో పాటు ఇతర దేశాల నుంచి ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందా అన్న ప్రశ్నకు సమాచారం ఇచ్చారని చెప్పారు మహేష్ సేననాయకే. ఇప్పటికే భారత జాతీయ విచారణ సంస్థ తమిళనాడులో కేరళలో కొన్ని చోట్ల దాడులు చేసింది. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులతో ఇక్కడ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దాడులకు సంబంధం ఉన్న రియాస్ అబూబకర్ను అరెస్టు చేయడంతో తమిళనాడులో ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్స్ ఆపరేట్ చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో పలు చర్చీలు హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 253 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో ఇలాంటి ఉగ్రదాడి జరగడం ఆ దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. దాడుల వెనక తమ హస్తం ఉన్నట్లు ఐసిస్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.