ట్రాలీలో మృతదేహాల గుట్ట: మహిళలు, పిల్లలు సహా: ఎన్నో అనుమానాలు
వాషింగ్టన్: అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ భారీ ట్రక్ ట్రాలీలో మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. వారంతా వలస కూలీలు అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కొన ప్రాణాలతో ఉన్న మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. మెక్సికోతో సరిహద్దులను పంచుకుంటోన్న టెక్సాస్ స్టేట్లో ఈ ఘటన సంభవించింది.
తమను కాపాడాలంటూ ట్రక్ నుంచి ఆర్తనాదాలు వినిపిస్తోండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. టెక్సాస్ శాన్ ఆంటోనియో నగర శివార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగర శివార్లలోని క్వింటానా రోడ్లో, రైల్వే ట్రాక్ పక్కనే ఓ పాత తుక్కు వాహనాల యార్డ్లో పార్క్ చేసి ఉంచిన ట్రక్లో ఈ మృతదేహాలు కనిపించాయి.
18 టైర్లు గల అతి పొడవైన ట్రక్ అది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా మెక్సికో నుంచి అమెరికాకు వలస వస్తోన్న కూలీలు అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తరచూ మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తుంటారు వలస కూలీలు. మృతులు కూడా అక్రమంగానే అమెరికాలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. శాన్ ఆంటోనియోలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది.
ఫలితంగా- ట్రక్లోని కంటైనర్లో ప్రయాణిస్తోన్న వారంతా ఎండ వేడి, ఊపిరి ఆడకుండా ప్రాణాలు వదిలి ఉంటారని భావిస్తున్నారు. కొన ప్రాణాలతో ఉన్న వారిని మెథడిస్ట్ హాస్పిటల్ మెట్రొపాలిటన్కు తరలించారు. వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వారిని విచారించడం ద్వారా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని శాన్ ఆంటోనియో చీఫ్ షెరిఫ్ చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని అన్నారు.