70ఏళ్లు పాలించిన థాయ్ రాజు భూమిడోల్ కన్నుమూత
బ్యాంకాక్: సుదీర్ఘకాలంపాటు థాయ్లాండ్కు రాజుగా కొనసాగుతున్న భూమిబోల్ అదుల్యదేజ్(88) గురువారం కన్నమూశారు. ఆయన వయసు 88. 1946 సోదరుడి మృతితో థాయ్ సింహాసనాన్ని అధిరోహించిన ఆయన దివ్యాంశ సంభూతుడిగా...సాక్షాత్ భగవత్ స్వరూపంగా ప్రజల నుంచి అపార గౌరవాన్ని అందుకున్నారు.
ఆయన.. థాయ్లాండ్ను అత్యధిక కాలం పరిపాలించిన రాజుగా ప్రత్యేకత సాధించారు. సుమారు 70 ఏళ్లపాటు పరిపాలించిన ఆయనను 'రామా 9'గా కూడా వ్యవహరిస్తారు. ఎంతో కాలం నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.52 గంటలకు మరణించినట్లు రాజప్రాసాదం విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.
యువరాజు మహా వజిరలాంకోర్న్, యువరాణులు మహా చక్రి సిరింధోర్న్, సోంసావాలీ, ఛులభోర్న్లు ఆ సమయంలో ఆస్పత్రిలో అదుల్యదేజ్ వెంటే ఉన్నారు.
యువరాజు మహా వజిరలాంకోర్న్(63) ఇప్పుడిక థాయ్లాండ్ రాజు అవుతారు. ప్రధానమంత్రి ప్రయుత్ ఛాన్-ఓఛా గురువారం టీవీలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు.
భూమిబోల్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. నేటి కాలానికి చెందిన గొప్ప నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. ఆయనను కోల్పోయిన థాయ్లాండ్ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.