బస్సును ఢీకొట్టిన రైలు: 18 మంది మృతి, 30 మందికి గాయాలు
బ్యాంకాక్: థాయ్లాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ప్రమాదవశాత్తు ఓ బస్సును రైలు ఢీకొట్టడంతో 18 మంది మరణించారు. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. బ్యాంకాక్ నుంచి చాచియాంగ్ సావోలోని ఆలయం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
65 మందితో వెళ్తున్న టూరిస్టు బస్సు రైల్వే ట్రాక్ను దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. వర్షం పడుతుండటంతో రైలు వస్తున్నట్లు బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రమాద సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. రైలు వేగంగా ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. రక్తసిక్తమైన ఆ ప్రాంతం భయానకంగా మారింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ప్రయుత్ చాన్ ఓ చా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతి చెందినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
Recommended Video
కాగా, 2018 ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రమాదాల వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో థాయ్లాండ్ రెండో స్థానంలో ఉంది. టూ వీలర్, బస్సు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంటారని వెల్లడించింది. 2018లో ఓ బస్సు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు.