బొమ్మే కదాని మాట్లాడితే బుక్కయినట్లే! సైబర్ నేరగాళ్ల సరికొత్త వల!!
పిల్లలు ఆడుకునే బొమ్మల ద్వారా కూడా సైబర్ నేరగాళ్లు నిఘా వేస్తున్నారట.. మాటల్లో పెట్టి రహస్య సమాచారం సైతం లాగేస్తున్నారట.
బెర్లిన్: బొమ్మలంటే చిన్నారులకు ఎంత ఇష్టమో తెలియంది కాదు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కూడా రకరకాల బొమ్మలను కొని తెస్తుంటారు. ఇప్పడు ఈ బొమ్మలే కొంప ముంచుతున్నాయి.
పిల్లలు ఆడుకునే బొమ్మలను వెంటనే పారవేయాలని.. ఇకమీదట బొమ్మలు కొనరాదని జర్మనీ ప్రభుత్వం తాజాగా తన పౌరులను ఆదేశించింది. ఎందుకంటే.. పిల్లలు ఆడుకునే బొమ్మల ద్వారా కూడా సైబర్ నేరగాళ్లు నిఘా వేస్తున్నారట.. మాటల్లో పెట్టి రహస్య సమాచారం సైతం లాగేస్తున్నారట.
ఒకప్పుడు చెక్క బొమ్మలు ఉండేవి.. తర్వాత ప్లాస్టిక్ బొమ్మలు వచ్చాయి. ఇప్పుడు సాంకేతికత మరింత పెరిగి మనుషులతో మాట్లాడే డిజిటల్ బొమ్మలు కూడా వస్తున్నాయి. ఈ బొమ్మలను హ్యాక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు చిన్నారుల కదలికలను, మాటలను వింటున్నారట.
ముఖ్యంగా అమెరికాలో తయారు చేస్తున్న 'మై ఫ్రెండ్ కేలా'అనే బొమ్మను సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ఇవి యూరప్ దేశాల్లో అధికంగా అమ్ముడుపోతున్నాయట. అక్కడి పిల్లలు ఈ బొమ్మను బాగా ఇష్టపడుతున్నారట.
మనం ఏ ప్రశ్న అడిగినా ఇంటర్నెట్ సహాయంతో ఈ బొమ్మ సమాధానం చెబుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఈ బొమ్మను ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఆధారంగా పనిచేసే ఈ బొమ్మలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారట.
పిల్లల కదలికలనే కాక.. ఇంట్లో పెద్దలు మాట్లాడే మాటలను కూడా వింటున్నారని ఫెడరల్ నెట్ వర్క్ ఏజెన్సీ గుర్తించింది. దీంతో ఈ మై ఫ్రెండ్ కేలా బొమ్మలను, ఇతరత్రా స్మార్ట్ బొమ్మలను విరిచేసి పారవేయమని జర్మనీ తమ దేశ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాడు, ఈ బొమ్మలను విక్రయిస్తే.. వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.