అభినందన్ విడుదలకు ప్రపంచ దేశాల ఒత్తిడే కారణం..యూఎస్, యూఏఈ, సౌదీ దేశాలదే కీ రోల్
జెనీవా ఒప్పందం ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ విడుదలచేయవలసి ఉన్నా,అభినందన్ ను త్వరగా విడుదల చేయడానికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ మరియు ఇతర దేశాల ఒత్తిడి కారణమని తెలుస్తోంది. భారత దేశంలో శాంతి చర్చలను స్వాగతించటం కోసం అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం భారత్ కు తిరిగి పంపిస్తామని చెప్పడంతో భారత్ కు కాస్త ఉపశమనం కలిగింది. అయితే యుద్ధ నివారణ కోసం ప్రపంచ దేశాలు చేసిన అంతర్జాతీయ ఒత్తిడితోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అభినందన్ ను భారత్ కు అప్పగించేందుకు చొరవ చూపిన యూఎస్
యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా అభినందన్ ను భారత్ పంపించడానికి పాక్ పైన ఒత్తిడి తీసుకు వచ్చింది. అయితే ఈ ప్రయత్నాల పైన భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హనోయ్ లో మీడియాతో మాట్లాడుతూ అభినందన్ ను భారత్ కు పంపించే విషయంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ అన్ తో భేటీ అయిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నుంచి ఇరు దేశాల ను ఆపడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ సంయుక్త రాష్ట్రాల విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపెయో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ దోవాల్ తో 25 నిమిషాలపాటు మాట్లాడారని తెలుస్తుంది. అమెరికా అభినందన్ ను భారత్ కు పంపే విషయంలోనూ, ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొని విషయంలోనూ కీ రోల్ పోషించిందని తెలుస్తుంది.
శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించిన యూఏఈ
మరో ముఖ్య భూమిక పోషించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యూఏఈ సైతం భారత స్నేహ సంబంధాలు నేరపేలా శాంతి వాతావరణం చేకూరేలా కీలక భూమిక పోషించింది. అరబ్ దేశ రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ భారత్ మరియు పాకిస్తాన్ ప్రధానమంత్రుల కు తాను కాల్ చేసి మాట్లాడాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇరు దేశాలు దేశ అభివృద్ధి కోసం పని చేయాల్సిన అవసరం ఉందని, తెలివైన నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు గా ఆయన ట్వీట్ చేశారు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశంతో స్నేహ సంబంధాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గా అర్థం అవుతోంది.
అరబ్ దేశాల సానుకూల దృక్పథానికి కితాబిచ్చిన సుష్మా స్వరాజ్
ఇదే సమయంలో అబుదాబిలో జరిగిన ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ఈ ప్లీనరీకి గౌరవ అతిథిగా భారత్ నుండి తనను ఆహ్వానించటం ఇదే మొదటిసారని ఆమె అన్నారు. ఐఓసీ చాలా సంవత్సరాల పాటు కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ పక్షం తీసుకుందని, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి దాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోయాడు అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సమావేశానికి ఇండియా హాజరైతే తన వచ్చేది లేదని బెదిరించాడని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ తమను ఈ కాన్ఫరెన్స్ కు గౌరవ అతిథిగా ఆహ్వానించడం అరబ్ దేశాలకు భారత్ పై ఉన్న సానుకూల దృక్పథానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చిన సౌదీ అరేబియా
అభినందన్ విషయంలో మరో కీ రోల్ పోషించింది సౌదీ అరేబియా. పుల్వామా దాడుల తరువాత ఉద్రిక్తతలు పెరుగకుండా చూడడానికి చాలా ప్రయత్నం చేసింది సౌదీ అరేబియా. విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి అయిన ఆడెల్ అల్ జుబేర్ ఇస్లామాబాద్ వెళుతుండగా ఆ దేశ రాజు నుండి భారత్ పాకిస్తాన్ ల విషయంలో ఒక ముఖ్యమైన సందేశం అందింది. దీంతో దేశానికి వచ్చిన సౌదీ రాయబారి యాదృచ్చికంగా మరోమారు నరేంద్ర మోడీని కలిశారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడం కోసం చర్చించారు.
యుద్ధ నివారణ కోసం ప్రయత్నం చేసిన యునైటెడ్ నేషన్స్
యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు మరియు యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్యులు భారత్ ను సంయమనంతో ఉండాలని కోరారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చైనా సైతం శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. చివరికి జెనీవా ఒప్పందం ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేయాల్సి ఉన్నా ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకే త్వరగా విడుదల చేస్తోంది పాకిస్తాన్. భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నమే ఇంత త్వరగా అభినందన్ ను పాకిస్తాన్ భారత్ పంపించాలనే నిర్ణయానికి ప్రధాన కారణం.