వారిమధ్య విభేదాలు ప్రపంచ వృద్ధికి గుదిబండలు..!ఐఎంఎఫ్ అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే వ్యాఖ్య..!!
పారిస్/హైదరాబాద్ : అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య పరమైన సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా వాటిల్లనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే ఆందోళన వ్యక్తంచేశారు. పారిస్లో నిర్వహించిన పారిస్ ఫోరం కార్యక్రమానికి హాజరైన ఆమె ఓ మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి అమెరికాకు వస్తున్న దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసిందన్నారు.
మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై భారీగా పడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయిర్ హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రగతిని బలహీనపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మానేయాలన్నారు. అధిక మొత్తంలో సుంకాలు పెంచడం అనేది ఒక వ్యవస్థ పతనం వైపుపకు పయనిస్తుందని చెప్పడానికి ఒక సంకేతం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ వృద్ధిని అడ్డుకునేలా ఉంటాయని బ్రూనో హెచ్చరించారు. చైనా ఎగుమతులపై అధిక మొత్తంలో సుంకాలు పెంచిన నేపథ్యంలో అమెరికా వాణిజ్య విభాగంతో ఈ విషయమై చర్చించేందుకు గాను ఈ వారం చైనా నుంచి ఓ బృందం అమెరికా వెళ్లనున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది.