ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం: ఫెడెక్స్, యూపీఎస్ వాహనాలు రెడీ: అన్ని రాష్ట్రాలకూ
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా బారిన పడి అత్యధిక ప్రాణనష్టాన్ని చవి చూసిన దేశాల్లో టాప్లో ఉంటోంది అగ్రరాజ్యం అమెరికా. ఇక్కడ మూడు లక్షలకు మందికి పైగా మరణించారు. కోటి 70 లక్షల వరకు కేసులు నమోదు అయ్యాయి. కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల మధ్య కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందక్కడ. స్వదేశానికే చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను వినియోగంలోకి రాబోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వ్యాక్సిన్ను సరఫరా చేయడానికి అవసరమైన ఏర్పాట్లను అమెరికా ప్రభుత్వం పూర్తి చేసింది.
Recommended Video
సోమవారం నుంచి అన్ని రాష్ట్రాలకూ..
ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ను సోమవారం నుంచి అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేయబోతోంది. దీనికి అవసరమైన ఆదేశాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసింది. వ్యాక్సిన్ను తరలించడానికి అవసరమైన వాహనాలను సిద్ధం చేసింది. తొలిదశ షిప్మెంట్ బాధ్యతలను ఫెడెక్స్, యూపీఎస్ కంపెనీలకు అప్పగించింది. ఒకరోజు ముందే- వ్యాక్సిన్ డోసులతో కూడుకున్న భారీ కంటైనర్లు అన్ని రాష్ట్రాలకు బయలుదేరి వెళ్తాయని, దీనికి అవసరమైన బ్లూప్రింట్ను సిద్ధం చేశారు.
ఆర్మీ సారథ్యంలో..
ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమం మొత్తాన్నీ అమెరికా ఆర్మీ అధికారులు పర్యవేక్షించనున్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఇది కొనసాగుతుంది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ (ఓడబ్ల్యూఎస్) పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తొలిదశలో 425 పాయింట్లకు వ్యాక్సిన్ను సరఫరా చేస్తామని ఆర్మీ జనరల్ గుస్తావె పెర్నా తెలిపారు. బుధవారం నాటికి మరో 66 పాయింట్లకు వాటిని చేర్చుతామని పేర్కొన్నారు. తొలిదశ కింద మూడు మిలియన్ల డోసులను పంపిణీ చేస్తామని చెప్పారు. తొలి వ్యాక్సిన్ ఇంజెక్షన్ను ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఇంకా తెలియరాలేదు. హెల్త్కేర్ వర్కర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది, ఇతర ఫ్రంట్లైన్ వారియర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మిచిగాన్లోని ఫైజర్ ప్లాంట్ నుంచి
ఫైజర్ కంపెనీకి మిచిగాన్లోని కలామజూలో వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ ఉంది. తొలిదశ వ్యాక్సిన్ డోసులతో కూడుకున్న వాహనాలు ఇక్కడి నంచే బయలుదేరి వెళ్లనున్నాయి. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మెక్కెస్సన్, ఫార్మా ఛైన్ కంపెనీలు సీవీఎస్, రైట్-ఎయిడ్ వంటి కంపెనీలు తరలింపులో పాల్గొంటున్నాయి. ఫెడెక్స్, యూపీఎస్ సంస్థల వాహనాలను వారు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ అమెరికన్ ఆర్మీ పర్యవేక్షిస్తోంది. ఒక్కో వాహనంలో మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రత సామర్థ్యంతో కూడిన రిఫ్రెజిరేటింగ్ వ్యవస్థ ఉంది.
వ్యాక్సిన్కు ఎఫ్డీఏ అనుమతి..
కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఫైజర్ వ్యాక్సిన్ వినియోగించే దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా చేరింది. ఇప్పటికే బ్రిటన్, కెనడా, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ వ్యాక్సిన్ వినియోగానికి పచ్చజెండా ఊపాయి. ఇక అమెరికాలో త్వరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సాధారణ ప్రజల వినియోగానికి వీలుగా ఫైజర్ వ్యాక్సిన్ తొలిదశ అడ్డంకిని అధిగమించింది. ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (ఎఫ్డీఏ)కు చెందిన నిపుణుల ప్యానెల్ ఈ మేరకు అనుమతులను జారీ చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంపై నిర్వహించిన ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ ఓట్లు వినియోగం వైపే పడ్డాయి.
అమెరికాకే చెందిన ఫైజర్..
ప్రపంచంలో కరోనా వైరస్ నిర్మూలనకు ఉద్దేశించిన వ్యాక్సిన్ను మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనతను అందుకుంది ఫైజర్ కంపెనీ. అమెరికాకే చెందిన ఈ ఫార్మూసూటికల్స్ సంస్థ.. జర్మనీకి చెందిన బయోఎన్టెక్తో కలిసి కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీకి చెందిన ప్యానెల్ రెండురోజుల కిందటే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వినియోగానికి వారం రోజుల్లో అనుమతి ఇచ్చేలా చర్యలను తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ తెలిపారు. ఆ వెంటనే పంపిణీకి శ్రీకారం చుట్టారు.