హజ్ తొక్కిసలాట మృతులు 1453,భారతీయులు 101
దుబాయ్: గత నెల 24వ తేదీన హజ్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య వేలలోనే ఉంది. ఈ విషాదం అనంతరం సౌదీ అరేబియా ఘటనపై స్పందిస్తూ... ఘటనలో 769 మంది మృతి చెందారని, 934 మంది గాయపడ్డారని తెలిపింది.
అయితే, ఈ సంఖ్య వేలలోనే ఉందని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) శుక్రవారం వెల్లడించింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 1453 మంది చనిపోయారని తెలిపింది. హజ్ యాత్రలో 1990 తొక్కిసలాటనే ఇప్పటి వరకు అధికారికంగా అతిపెద్ద ప్రమాదం.
నాడు 1426 మంది మృతి చెందారు. అయితే, ఇప్పుడు 1453 మంది మృతి చెందడంతో... 1990 కంటే పెద్ద ప్రమాదంగా ఇది చెప్పారు. సౌదీ అధికారుల ప్రకటనలు, వివిధ దేశాలు వెల్లడించిన వివరాల ఆధారంగా 1453 మంది మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
భారతీయులు 101 మంది
హజ్ దుర్గటనలో మృతి చెందిన వారి భారతీయుల సంఖ్య 101కి చేరుకుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వారాజ్ ప్రకటించారు. మరో 32 మంది యాత్రీకుల జాడ తెలియరావడం లేదని సౌదీ అధికారులు వెల్లడించినట్లు చెప్పారు.