అమెరికాలో భారతీయులుగా ఉండటమా మజాకా ? అధ్యక్ష ఎన్నికల్లో అందరి చూపూ వారిమీదే..
అమెరికాకు ఏళ్ల క్రితమే వలస వెళ్లి అక్కడే పాతుకుపోయిన భారతీయులు ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభావం చూపుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘన అన్నట్లుగా జనాభా తక్కువే అయినా ఎన్నికల్లో చూపుతున్న ప్రభావం చూస్తే మాత్రం భారతీయులా మజాకా అన్నట్లుంది. అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ శిబిరాలకు ఇప్పుడు నిత్యం భారతీయుల జపం లేకపోతే రోజు గడవడం లేదంటే అతిశయోక్తి కాదు. చివరికి వారి సలహాదారులు, సాంకేతిక నిపుణుల రూపంలోనూ భారతీయులు వారి క్యాంపుల్లో బిజీగా కనిపిస్తున్నారు.
జో బైడెన్ గెలిస్తే అమెరికా మరో వెనిజులా: ఆయన ఓ చెత్త అభ్యర్థి అంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు
అగ్రరాజ్యంలో భారతీయం...
ప్రపంచదేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికాకు భారతీయుల వలసలు ఈనాటికి కావు. భారత్కు స్వాతంత్రానికి పూర్వమే అమెరికాకు భారత్ నుంచి వలసలు ప్రారంభమైనా ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మార్పులు మాత్రం ఇరుదేశాలను బాగా దగ్గర చేశాయి. ఉపాధి, ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, రాజకీయాలు, సామాజిక సేవ ఇలా ఒక్కటేమిటి పలు రంగాల్లో భారతీయులు దశాబ్దాలుగా అమెరికాలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. భారతీయ నేపథ్యం ఉన్న వారు అమెరికాలో పలు రాష్ట్రాలకు గవర్నర్లుగా కూడా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ భారత మూలాలున్న కమలా హ్యారిస్ డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు. దీంతో పాటు కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలను నిర్దేశించే స్ధాయిలో భారతీయులు ఉండటం మనకు ఎంతో గర్వకారణంగా నిలుస్తోంది.
అమెరికా ఎన్నికల్లో భారతీయులు..
అమెరికాలో మొత్తం భారతీయుల జనాభా దాదాపు 4.16 మిలియన్లుగా ఉంది. ఇందులో 2.6 మిలియన్లు అమెరికా పౌరసత్వం కూడా కలిగి ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కోసం నమోదు చేసుకున్న ఓటర్లలో వీరి సంఖ్య మాత్రం ఒక్క శాతం కూడా ఉండదు. అయినా డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ శిబిరాల ప్రచార ప్రాధాన్యతల జాబితాలో మాత్రం భారతీయులకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. భారతీయులను తమవైపు తిప్పుకునేందుకు ఇరు శిబిరాలు చేయని ప్రయత్నం లేదు. ఇవన్నీ అంతిమంగా భారతీయులను సైతం గ్రూపులుగా, ఎన్నికలను ప్రభావితం చేసే వర్గాలుగా మార్చేస్తున్నట్లు తాజాగా నిర్వహించిన ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (ఐఏఏఎస్)కు సహ రచయితగా ఉన్న మిలన్ వైష్ణవ్ చెప్పారు.
భారతీయుల ఓట్లు ఎందుకు కీలకమంటే ?
అమెరికా ఎన్నికల్లో భారతీయుల ప్రభావాన్ని అధ్యక్ష రేసులో ఉన్న ఇరువురు అభ్యర్ధులు కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయినా తెరవెనుక మాత్రం వారి ఓట్ల కోసం చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలుగా పేరొందిన ఫ్లోరిడా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో మెజారిటీ సాధించాలంటే భారతీయుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడం తప్పనిసరని ఇరువురు అభ్యర్ధులు భావిస్తున్నారు. అందుకే అక్కడ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య 2016 అధ్యక్ష ఎన్నికల్లో విజేతల మెజారిటీని మించి ఉంది. దీంతో సిద్దాంతపరంగా చూసినా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే వీరి మద్దతు తప్పనిసరైంది.
ఇతర ఓటర్లపై గణనీయమైన ప్రభావం..
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లుగా నమోదైన భారతీయుల సంఖ్య ఒక్కశాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ వీరు అన్ని స్ధాయిల్లోనూ ఎక్కువ మంది అభ్యర్ధులు, ఓటర్లు, నిధుల సమీకరణను ప్రభావితం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలకు నిధులు సరఫరా చేసే పొలిటికల్ యాక్షన్ కమిటీల్లో అగ్రస్ధానంలో ఉన్న ఏఏపీఐ విక్టరీ ఫండ్ వ్యవస్ధాపకుడిగా ఉన్న శేఖర్ నరసింహన్ ఇది అగ్రరాజ్యంలో కాలాన్ని బట్టి వస్తున్న మార్పుగా అభివర్ణించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయుల్లో 70 శాతం మంది 2000 సంవత్సరం తర్వాత వచ్చిన వారే. ఈసారి ఎన్నికల్లోనూ వీరి ప్రభావమే ఎక్కువని తెలుస్తోంది. తమ ఓటు వేయడంతో పాటు వీరు ఇతర ఓటర్లను కూడా ప్రభావితం చేస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.
Recommended Video
డెమోక్రాట్లవైపే వీరి మొగ్గు...
భారతీయులకు దగ్గరయ్యేందుకు అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గత నాలుగేళ్లలో ఆయన అనుసరించిన భారతీయ వ్యతిరేక విధానాల కారణంగా ఎక్కువ మంది ఆయన్ను తప్పిస్తేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఐఏఏఎస్ తాజా సర్వే ప్రకారం నమోదైన ఓటర్లలో 72 శాతం మంది భారతీయులు డెమోక్రాట్ అభ్యర్ధి బిడెన్కూ, 22 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్కూ ఓటు వేసే అవకాశముంది. అయితే అమెరికన్ భారతీయులు డెమోక్రాట్లతో ఎక్కువగా మమేకమైనా ట్రంప్ ఎన్నికైన 2016 సంవత్సరం నుంచి మాత్రం కాస్త ఆయనవైపు మొగ్గినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో చూసినా మొత్తం 158 మంది ఆసియా అమెరికన్ పసిఫిక్ ద్వీప అభ్యర్ధులు అమెరికాలో రాష్ట్రాల శాసనసభలకు పోటీపడుతున్నారు. ఇదో రికార్డుగా చెప్తున్నారు. వీరిలో 75 శాతం మంది డెమోక్రాట్లే ఉన్నారు. 25 శాతం మంది రిపబ్లికన్లు ఉన్నారు.