2015లో 686 మంది లేపేశాం: పాక్ తాలిబన్
ఇస్లామాబాద్: 2015వ సంవత్సరంలో తాము 686 మందిని చంపేశామని పాకిస్థాన్ కు చెందిన తాలిబన్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. 2015 జనవరి 3 నుంచి 2015 డిసెంబర్ 26 వరకు తాము ఈ హత్యలు చేశామని అంటున్నారు.
2015 జనవరి 3 నుంచి డిసెంబర్ 26 మధ్య కాలంలో పాకిస్థాన్ లోని పలు నగరాలు, వాయువ్య గిరిజన ప్రాంతాల్లో పోలీసులు, రాజకీయ నాయకులు, భద్రతా దళాలను లక్షంగా చేసుకుని తాము ఈ దాడులు చేశామని ఉర్దూలో వ్రాసిన నివేదికను తాలిబన్లు విడుదల చేశారు.
2015లో మొత్తం మీద 75 హత్యలు చేశామని, 19 ఐఈడీ పేలుళ్లు, 12 మెరుపు దాడులు, 10 దాడులు, 17 క్షిపణి దాడులు, ఐదు ఆత్మాహుతి దాడులు చేశామని, ఈ మొత్తం దాడుల్లో 686 మంది చనిపోయారని పాకిస్థాన్ తెహ్రీక్ -ఎ- తాలిబన్ (టీటీపీ) తెలిపింది.
సెప్టెంబర్ నెలలో పెషావర్ ఎయిర్ బేస్ పై తాము జరిపిన దాడిలోనే 247 మంది చనిపోయారని టీటీపీ తన నివేదికలో వెల్లడించింది. అయితే తాలిబన్లు తమ బలాన్ని అధికంగా చేసుకోవాలని మృతుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్నారని, పాకిస్థాన్ లో భద్రత మెరుగుపడిందని అక్కడి అధికారులు అంటున్నారు.