టర్కీకి వార్నింగ్ ఇచ్చిన రష్యా: పైలెట్ సేఫ్
రష్యా: టర్కీ మిలటరి చేతిలో కూల్చివేతకు గురైన రష్యా యుద్ధ విమానం సుఖోయ్ - 24 పైలెట్ ఒకరు క్షేమంగా ఉన్నారని వెలుగు చూసింది. మా పైలెట్ ను సిరియా ఆర్మీ బలగాలు క్షేమంగా రక్షించారని రష్యా రాయబారి అలెగ్జాండర్ ఒర్లోవ్ తెలిపారు.
రష్యా యుద్ద విమానాన్ని టర్కీ సైనిక దళాలు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో యుద్ద విమానంలోని ఇద్దరు పైలెట్లు పారాచూట్ల సహాయంతో కిందకు దూకేశారు. ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నారని మొదట రష్యా ప్రకటించింది.
అయితే అందులో ఓ పైలెట్ కు తీవ్రగాయాలై సిరియా తిరుగుబాటు దారులకు చిక్కాడని, చివరికి అతను మరణించాడని రష్యా రాయబారి అలెగ్జాండర్ ఒర్లోవ్ చెప్పారు. మరో పైలెట్ మాత్రం సిరియా తిరుగుబాటు దారులకు చిక్కకుండా తప్పించుకున్నాడని అన్నారు.
ఆ రెండవ పైలెట్ ను సిరియా సైనిక దళాలు రక్షించారని, ప్రస్తుతం అతను క్షేమంగానే ఉన్నాడని రష్యా స్పష్టం చేసింది. టర్కీ ద్వంద విధానాలకు పాల్పడుతున్నదని రష్యా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది.
తాము ఎన్ని సార్లు హెచ్చరించినా రష్యా యుద్ద విమానం పైలెట్లు పట్టించుకోనందు వలనే ఈ విదంగా జరిగిందని టర్కీ అంటున్నదని రష్యా ఆరోపించింది. ఈ విషయంలో టర్కీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని రష్యా ప్రకటించింది.