విమానాలకు బెదిరింపు: పారిస్లో ఫైరింగ్, ఇద్దరి మృతి
లాస్ ఏంజిల్స్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఫ్రాన్స్ దేశం మీద కక్షకట్టారు. ఫ్రాన్స్ కు చెందిన రెండు విమానాలను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు విమానాలను అత్యవసరంగా దారిమళ్లించి ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు.
అగ్రరాజ్యం అమెరికా నుంచి మంగళవారం రాత్రి బయలుదేరిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఎయిర్ ఫ్రాన్స్ 65 విమానం ప్యారిస్ కు బయలుదేరింది.
విమానం బయలుదేరిన కాసేపటి తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఆ విమానాన్ని బాంబులతో పేల్చేస్తున్నామని బెదిరించాడు. వెంటనే విమానం దారి మళ్లించి సాల్ట్ లేక్ సిటీలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. విమానంలో పరిశీలించగా ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తరువాత వాషిగ్టంన్ నుంచి ఎయిర్ ఫ్రాన్స్ 55 విమానం ప్యారిస్ బయలుదేరిన విమానాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. వెంటనే అధికారులు విమానాన్ని దారి మళ్లించి నోవా స్కోటియా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో ఎలాంటి బాంబు లేదని తెలియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
రెండు విమానాలలోని ప్రయాణికులను తరువాత వేరే విమానాలలో ప్యారిస్ పంపించారు. ప్యారిస్ ఉగ్రదాడులతో విషాదంలో మునిగిపోయిన ఫ్రాన్స్ ప్రజలు మళ్లి ఇలాంటి దాడులు జరగరాదని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
పారిస్లో మళ్లీ కాల్పుల కలకలం
పారిస్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఐదు రోజుల క్రితం జరిగిన దారుణకాండ ఉగ్రవాదుల కోసం సైన్యం, పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ ఉత్తర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానిత వ్యక్తులపై కాల్పులు జరిపారు.
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పారిస్ ఉగ్రదాడిలో పాల్గొన్న తొమ్మిదో ఉగ్రవాది కోసం పారిస్ శివారులో పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిషేధించారు.