భారత్ కోసం అమెరికా చారిత్రాత్మక నిర్ణయం: ఏమిటీ కమాండ్ లైన్? చైనాకు చెక్!
Recommended Video
వాషింగ్టన్: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వ్యూహాత్మకంగా అమెరికా - పసిఫిక్ కమాండ్ లైన్ను ఏర్పాటు చేసిన అమెరికా ఇప్పుడు ఆ పరిధిని పెంచింది. ఇండో - పసిఫిక్ కమాండ్ లైన్ పేరుతో మరింత విస్తరించింది. తద్వారా భారత్కు సముచిత స్థానం కల్పించింది. అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలలో భారత్ను కీలక భాగస్వామిగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.
అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఉన్న యూఎస్ - పసిఫిక్ కమాండ్ లైన్ హెడ్ క్వార్టర్ పేరును ఇండో - పసిఫిక్ కమాండ్ లైన్గా మారుస్తున్నట్లు వారం క్రితం ప్రకటించింది. జూన్ 27వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు భారత్ సహా పలు దేశాలతో హవాయిలో అతిపెద్ద నావికాదళ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో భాగస్వామ్య దేశాలతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నామని, ఈ పరిధిలోని దేశాల్లో మరింత స్థిరత్వం కోసం ఈ పేరు మార్పు దోహదపడుతుందని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ అప్పుడు వెల్లడించారు.
దాదాపు 10 కోట్ల చదరపు మైళ్ల కంటే ఎక్కువ ప్రాంతంలో ఈ కమాండ్ లైన్ వ్యాపించి ఉంటుంది. అటు అమెరికా - ఇటు భారత్ల పశ్చిమ తీరాల మధ్య, ఇటు ఆర్కిటిక్ - అంటార్కిటిక్ ఖండాల మధ్య విస్తరించింది. ఈ ప్రాంతంలో 3.75 లక్షల మంది సైనికులను మోహరించనుంది. పసిఫిక్ - హిందూ మహాసముద్రాల మధ్యన ఉండే 36 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయి.
ఆయా దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపారాలు, మిలటరీ సమన్వయం, ఉగ్రవాదంపై పోరు, సంయుక్త నిఘా తదితర అంశాల్లో అమెరికా సహకరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యానికి చైనా ప్రయత్నాలకు ఇది ప్రత్యామ్నాయమని అంటున్నారు. అదే సమయంలో భారత సముద్ర సరిహద్దులు సుదూర ప్రాంతాలకు విస్తరిస్తాయి.