పంతం నెగ్గించుకున్న ట్రంప్: 'ట్రావెల్ బ్యాన్'కు సుప్రీం ఓకె.. ఇక ఆ 6దేశాలకు నో ఎంట్రీ!
వాషింగ్టన్: విదేశీ వలసలకు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ తీసుకొచ్చిన ట్రావెల్ బ్యాన్ కు అక్కడి సుప్రీంకోర్టు అడ్డంకులు క్లియర్ చేసింది. కింది స్థాయి కోర్టులు ఇచ్చిన నిలుపుదలను ఎత్తివేస్తూ.. అమెరికా శరణార్థుల విషయంలో ట్రంప్ నిర్ణయంతో కోర్టు ఏకీభవించింది. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ వచ్చే అక్టోబర్లో జరగనున్నందునా.. అప్పటివరకు బ్యాన్ కొనసాగడం ఇక లాంఛనం.
ట్రంప్ కీలక నిర్ణయం.. మరో 'వలస చట్టం'.. ఇరాక్కు ఊరట
అమెరికా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలకు న్యాయ సమ్మతం లభించినట్లయింది. దీంతో వచ్చే 72గంటల్లోనే ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ నిబంధనలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, ఇరాన్, యెమెన్ దేశాలపై వచ్చే మూడు నెలలు అమెరికాలోకి రాకుండా నిషేధం కొనసాగనుంది.
Recommended Video
కొత్త వీసాలకే వర్తిస్తుంది:
ట్రావెల్ బ్యాన్ అమలులో భాగంగా.. ఇప్పటికే జారీ అయిన వీసాలపై ఎలాంటి నిషేధం ఉండబోదు. నిషేధానికి గురైన 6దేశాల నుంచి కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక ఇప్పటికే అమెరికాలో ఆశ్రయం పొందుతూ కుటుంబాలతో ఉంటున్నవాళ్లు.. తమ తమ బంధుత్వాలను నిరూపించుకోవాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. కేవలం నిషేధం ఎదుర్కొంటున్న దేశాలే గాక.. అన్ని దేశాల శరణార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించడం గమనార్హం.
గురువారం నుంచి అమలులోకి:
గురువారం నుంచి స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. అమెరికాలో ఉండే విదేశీ తాతలు, మునిమునవళ్లు, సోదరులు, సోదరిమణులు, కాబోయే భర్తలు, భార్యలు.. ఇలా సన్నిహిత సంబంధాలు కలిగినవారెవరైనా సరే, అమెరికాలో ఉంటున్న తమవాళ్ల వద్ద ఆశ్రయం పొందుతున్నట్లయితే తమ బంధుత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. చట్టబద్దంగా డాక్యుమెంట్ రూపంలో తమ బంధుత్వాలను నిరూపించుకోవాలని సూచించింది.
వ్యాపారస్తులు, నిపుణుల అవసరాలను గుర్తెరిగి ఈ కొత్త నిబంధన చేరుస్తున్నట్లు అమెరికి స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. జర్నలిస్టులు, విద్యార్థులు, ఇతర ఉద్యోగులు, సరైన ఆహ్వానంతో అమెరికాలో అడుగుపెడితే.. ట్రావెల్ బ్యాన్ నుంచి వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది.
జనవరిలో 'ట్రావెల్ బ్యాన్' వస్తే:
గత జనవరిలో ట్రంప్ సర్కార్ ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురాగా.. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై నిరసనలు వెల్లువెత్తగా.. పలువురు ప్రజాస్వామిక వాదులు అమెరికా కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై అక్కడి కిందిస్థాయి కోర్టులు స్టే విధించాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆ నిబంధనలు ఎత్తేయడంతో ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది.
90రోజులు పాటు నో ఎంట్రీ:
అక్టోబర్ లో కేసు పూర్తి స్థాయి విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో.. వచ్చే 90రోజుల పాటు 6ముస్లిం దేశాలపై నిషేధం కొనసాగనుంది. అలాగే అమెరికాకు వచ్చే శరణార్థులకు సైతం 120రోజుల నిషేధం వర్తిస్తుంది. దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే.. అలాంటి వారికి ఇబ్బంది కలిగించకూడదని సుప్రీం ఆదేశించింది.