అమెరికా ఎంబసీ మా లక్ష్యం: తాలిబన్
కాబుల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగానే తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని తాలిబన్ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నాం కాబూల్ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిందని అఫ్ఘానిస్థాన్ పోలీస్ చీఫ్ జనరల్ అబ్దుల్ రెహమాన్ రహామి తెలిపారు.
ఈ దాడిలో ఉగ్రవాది టయోట కరోలా కారులో వేగంగా వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. అమెరికా రాయబారి కార్యాలయం- అఫ్ఘానిస్థాన్ సుప్రీం కోర్టు మద్యలో మిలటరి బలగాలు ఉగ్రవాది వెళుతున్న కారును అడ్డుకుంటున్న సమయంలో మిలటరి బలగాల వాహనాల దగ్గరే ఉగ్రవాది కారులోనే తనను తాను పేల్చేసుకున్నాడు.
ఈ ఆత్మాహుతి దాడిలో ఒక పౌరుడు దుర్మరణం చెందాడు. 22 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి జరిగిన వెంటనే మిలటరి అధికారులు అలర్ట్ అయ్యారు. కాబూల్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు.
ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామే అని తాలిబన్ ఉగ్రవాదులు ట్విట్టర్ లో ప్రకటించుకున్నారు. అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా తాము ఈ దాడికి పాల్పడ్డామని చెప్పారు. ముందు జాగ్రత చర్యగా కాబూల్ లోని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.