అమెరికా ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ- ట్రంప్ కరోనాతో అనిశ్చితి- చేతులెత్తేస్తున్న విశ్లేషకులు
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు వచ్చే నెలలో జరిగే ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి జో బిడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతున్న సమయంలోనే ట్రంప్ కరోనా పాలవ్వడం, ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్ధుల రెండో విడత చర్చకు డుమ్మా కొట్టాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది. వర్చువల్ చర్చలో పాల్గొనేందుకు సైతం ట్రంప్ అంగీకరించకపోవడం వెనుక కారణాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ట్రంప్ కోలుకున్నా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై మాత్రం ఉత్కంఠ తప్పడం లేదు. ఓటర్లు మరోసారి ట్రంప్ను గట్టెక్కిస్తారా లేక బిడెన్కు జై కొడతారా అన్నది విశ్లేషకుల ఊహలకు కూడా అందడం లేదు.
Recommended Video
అమెరికా ఎన్నికల్లో అనిశ్చితి..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. నిన్న మొన్నటివరకూ రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్ధులు ట్రంప్, బిడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని భావించినా ట్రంప్కు కరోనా సోకడం ఎన్నికల వాతావారణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ట్రంప్ అధ్యక్ష అభ్యర్ధుల రెండో డిబేట్కు హాజరు కానని తేల్చిచెప్పడంతో తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అభ్యర్ధుల గెలుపోటములకు సంబంధించి కూడా అనిశ్చిత వాతావారణం నెలకొంది. ఈసారి ఎవరు గెలుస్తారో, ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో అన్నది తేలడం లేదు. ఎన్నికలకు నెల రోజులు కూడా సమయం లేకపోవడం, ట్రంప్ కరోనాతో బాధపడుతుండటం, అధ్యక్ష అభ్యర్ధుల డిబేట్ రద్దు కావడం వంటి పరిస్ధితులు ఎప్పుడూ చూడలేదని ఓటర్లు చెబుతున్నారు.
అమెరికా ఎన్నికల చరిత్ర...
అమెరికా ఎన్నికల చరిత్రను గమనిస్తే 1900 నుంచి ఇప్పటివరకూ కేవలం నాలుగు సార్లు మాత్రమే అధ్యక్ష రేసులో ఉన్న సిట్టింగ్ అధ్యక్షులు ఓడిపోయారు. ఇలా ఒక్కసారి మాత్రమే అధ్యక్షులుగా పనిచేసి రెండోసారి ఓడిపోయిన వారిలో విలియం హోవార్డ్ తాఫ్ట్, హెర్బర్ట్ హోవర్, గెలాల్డ్ ఫోర్డ్, జిమ్మీ కార్టర్ ఉన్నారు. 20వ శతాబ్దంలో చివరి సారిగా ఒక్కసారి మాత్రమే అధ్యక్షుడిగా పనిచేసి ఓడిపోయిన ప్రెసిడెంట్గా జార్జి బుష్ సీనియర్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత అధ్యక్షులుగా పనిచేసిన వారు తర్వాత పోటీ చేయకపోవడం, లేదా పోటీ చేసి గెలవడమే జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రతికూల పరిస్ధితుల్లో రెండోసారి పోటీ చేస్తుండటంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది.
స్వయంగా కరోనా బాధితుడై...
ఈ ఏడాది కరోనా ప్రభావం మొదలయ్యాక అమెరికాలో భారీగా జనం వైరస్ బారిన పడ్డారు. భారీ సంఖ్యలో మరణాలు కూడా చోటుచేసుకున్నాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలోనూ లాక్డౌన్ విధించేందుకు ట్రంప్ మొగ్గుచూపలేదు. తానే చాలా రోజుల పాటు మాస్క్ లేకుండా తిరిగారు. అంతటితో ఆగకుండా కరోనాకు పరిష్కారాలు అంటూ నోటికొచ్చిన విషయాలు మాట్లాడేవారు. దీంతో సగటు అమెరికన్లలో ట్రంప్పై విశ్వాసం సన్నగిల్లింది. తాజాగా ఆయనతో పాటు భార్య మెలానియాకు కూడా కరోనా సోకడంతో ఇక ట్రంప్పై జనంలో విశ్వాసం పూర్తిగా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం అమెరికా ఎన్నికలపై తీవ్రంగా కనిపిస్తోంది.
అధ్యక్షుడి వారసత్వం ఉపాధ్యక్షుడికే...
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కరోనాతో బాధపడుతూ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఆయనకు పూర్తిస్ధాయిలో వైద్యం అందుతోంది. అయినా ఎక్కడో ఓ అనుమానం. ట్రంప్కు జరగరానిది ఏదైనా జరిగితే ఎన్నికల పరిస్ధితి ఏంటి, వారసత్వంగా అధికారం ఎవరికి దక్కుతుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 1947లో అమెరికా పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ ప్రకారం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తన పదవీకాలంలో రాజీనామా చేసినా, మరణించినా, బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్ధితుల్లో ఉన్నా.. ఆయన స్ధానంలో ఉపాధ్యక్షుడే ఆ బాధ్యతలు చేపట్టవచ్చు. ఆ తర్వాత సెనేట్ స్పీకర్కు అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతం ట్రంప్ పరిస్ధితి గమనిస్తే ఆయన ఈ మూడో కోవలోకి వస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏదైనా జరగకవచ్చనే ప్రచారం ఊపందుకుంటోంది.