ఆ మూడు రోజులు.. చైనా ఘోర తప్పిదానికి మూల్యం చెల్లించుకుంటోన్న ప్రపంచం..
ప్రస్తుతం ప్రపంచం కరోనా విపత్తు కాలంలో ఉంది. అన్ని దేశాలు ఒక ఉత్పాతం ముందు నిసహాయంగా నిలబడ్డ సందర్భం ఇది. వైరస్ను ఎదుర్కోవడానికి దేశాలన్నీ తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఓవైపు నియంత్రణ చర్యలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగానే.. మరోవైపు వైరస్ మూలాలపై కూడా చర్చ జరుగుతోంది. చైనాలోని వుహాన్ నగరం నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చినప్పటికీ.. దాని కచ్చితమైన మూలాలపై మాత్రం స్పష్టత లేదు. అయితే కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా మారడం వెనుక చైనా నిర్లక్ష్య వైఖరి కూడా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చైనా చేసిన తప్పిదమేంటి..
గతేడాది అక్టోబర్లో వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ బయటపడింది. ఈ ఏడాది జనవరి నాటికి అది తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో జనవరి 23న అక్కడి ప్రభుత్వం వుహాన్లో లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో వుహాన్ నగరానికి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. చైనాలో సామూహిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలని మరుసటిరోజు ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కానీ చైనా చేసిన ఘోర తప్పిదమేంటంటే.. వుహాన్ లాక్ డౌన్ ప్రకటించిన మూడు రోజులకు.. అంటే జనవరి 27 నాటికి గానీ.. తమ దేశస్తులు సామూహికంగా ఇతర దేశాలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయలేకపోయింది. దీంతో ఆ మూడు రోజుల వ్యవధిలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికి ఆ వైరస్ విస్తరించింది.
చైనా నుంచి విదేశాలకు ఎంతోమంది..
చైనాలో ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుంచి లూనార్ న్యూఇయర్ సెలవులు. అయితే అప్పటికే వుహాన్లో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడం.. ప్రజారోగ్య సంక్షోభం ఉన్నప్పటికీ దేశంలో సామూహిక ప్రయాణాలను మాత్రం చైనా బహిష్కరించలేదు. అంతేకాదు, వ్యక్తిగత విదేశీ ప్రయాణాలపై కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో చాలామంది చైనీయులు జపాన్,సౌత్ కొరియా,ఇటలీ,స్పెయిన్,ఫ్రాన్స్,ఇంగ్లాండ్,నార్త్ అమెరికా,సౌత్ అమెరికా వంటి ప్రదేశాలకు ప్రయాణించారు.
చైనీయులు తమ వెకేషన్ పొడగించుకోవడంతో
కరోనా వైరస్ కారణంగా చైనాలో ఓవైపు రెస్టారెంట్లన్నీ మూతపడ్డ సమయంలోనే ఇది జరగడం గమనార్హం. చైనా నుంచి విదేశాలకు వెళ్లిన చాలామంది చైనీయులు తమ వెకేషన్ను పొడగించుకున్నారు. ప్రస్తుతం చలికాలమైన జపాన్,థాయిలాండ్ వంటి దేశాల్లో వారు వెకేషన్కు వెళ్లడంతో.. అక్కడ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది. ముఖ్యంగా జపాన్లోని హొక్కైడో కేపిటల్ సప్పోరోకి చైనా నుంచి గణనీయంగా టూరిస్టులు అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది.
Recommended Video
మూడు రోజుల నిర్లక్ష్యానికి.. ప్రపంచం మూల్యం..
గతంలో 2003లో చైనాను సార్స్ మహమ్మారి పీడించినప్పుడు.. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించి అందరి చేత హీరో అనిపించుకున్న జోంగ్ నాన్షన్(80) కరోనా వైరస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ఐదు రోజుల జాప్యం మూడు రెట్లు ఎక్కువ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుందని చెప్పారు. కానీ వాస్తవానికి మూడు రోజుల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వుహాన్ని లాక్ డౌన్ చేసిన మూడు రోజులకు గానీ విదేశాలకు సామూహిక ప్రయాణాలపై నిషేధం విధించకపోవడంతో ప్రపంచం మొత్తానికి వైరస్ విస్తరించింది. దీంతో చైనా చేసిన తప్పిదానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.