ధైర్యం చేశారు: జింబాబ్వే క్రికెట్ జట్టు పాక్లో అడుగుపెట్టింది
లాహోర్: జింబాబ్వే క్రికెట్ జట్టు ఎట్టకేలకు ధైర్యం చేసింది. పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడటానికి లాహోర్ చేరుకున్నారు. ఆరు సంవత్సరాల తరువాత టెస్ట్ హోదా కలిగిన ఒక క్రికెట్ జట్టు పాక్ లో అడుగు పెట్టడంతో అక్కడి క్రికెట్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
ఐదు క్రికెట్ మ్యాచ్ లు చూసి పండగ చేసుకోవచ్చని పాక్ క్రికెట్ అభిమానులు అంటున్నారు. పాక్, జింబాబ్వే జట్ల మధ్య రెండు టీ- 20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. మంగళవారం నాడు జింబాబ్వే క్రికెట్ టీం లాహోర్ చేరుకుంది.
నాలుగు వేల మంది భద్రతా సిబ్బంది జింబాబ్వే క్రికెట్ టీం సభ్యులకు భద్రత కల్పించారు. 2009వ సంవత్సరంలో శ్రీలంక క్రికెట్ జట్టు పాక్ పర్యటనలో ఉంది. ఆ సందర్బంలో కరాచీలో శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు వెళుతున్న బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఉగ్రవాదుల దాడిలో ఆరు మంది భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్ దుర్మరణం చెందారు. బస్సు సీట్ల కింద తలదాచుకున్న శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుండి పాక్ లో క్రికెట్ ఆడటానికి ఏ దేశస్తులు సాహసించలేదు.
పాక్ పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. అప్పటి నుండి పాక్ క్రికెట్ జట్టు బయటదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడుతున్నది. ఇప్పుడు జింబాబ్వే ధైర్యం చేసి పాక్ పర్యటనకు వెళ్లింది. ఈ శుక్రవారం పాక్-జింబాబ్వే జట్ల మద్య తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది.