సైనికుల వరుస అత్యాచారాలు: శరణార్థ మహిళల కన్నీటి గాథ
మయన్మార్ దేశంలో శరణార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ శరణార్థ మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
ఢాకా: మయన్మార్ దేశంలో శరణార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ శరణార్థ మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. సైనికులు వరుస అత్యాచారాలకు పాల్పడుతుండటంతో వారి కన్నీటి గాథకు అంతం లేకుండా పోతోంది.
'మాపై మయోన్మార్ సైనికులు ఒకరి తర్వాత మరొకరు వరుసబెట్టి అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. మమ్మల్ని మంచంపై తోసి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు' అని రోహింగ్యా శరణార్ధ మహిళలు కంటతడిపెట్టారు. మయన్మార్ సైనికుల అమానుష దాడులతో భయభ్రాంతులైన బాధిత మహిళలు తమ ఇళ్లు వదిలి బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కొండల్లో కోనల్లో ఆకలితో అలమటిస్తూ తలదాచుకున్నారు.
సైనికులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తమ సోదరుడు పారిపోగా వారు ఇళ్లను దహనం చేసి తమ అమ్మాయిలపై అత్యాచారం జరిపారని మహిళలు ఆవేదనగా చెప్పారు. తమ పిల్లలైన బాలికలపై సైనికులు అత్యంత క్రూరంగా అత్యాచారాలు చేశారని మహిళలు చెప్పారు.
సైనికుల దాడులతో తాము కిలోమీటర్ల దూరం నడచి సరిహద్దుల్లో తలదాచుకున్నామని వారు పేర్కొన్నారు. యువతులపై సైనికులు అత్యంత అమానుషంగా అత్యాచారాలు చేయడం వల్ల ఎంతోమంది రోహింగ్యా శరణార్ధ మహిళలు భయంతో వణుకుతూ కొండల్లో దుర్భర జీవనం గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు.