డాక్టర్ల వేషంలో.. మిలిటరీ హాస్పిటల్ పై ఉగ్రవాదుల దాడి, 30 మంది దుర్మరణం
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉన్న సర్దార్ దౌడ్ హాస్పిటల్ లోకి ఉగ్రవాదులు వైద్యుల దుస్తుల్లో ప్రవేశించారు. వారి కాల్పుల్లో ఇప్పటివరకు 30 మందికిపైగా మృతిచెందినట్లు తెలుస్తోంది.
కాబూల్: వైద్యుల దుస్తుల్లో ఉగ్రవాదులు ఓ ఆసుపత్రిలోకి చొరబడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉన్న సర్దార్ దౌడ్ హాస్పిటల్ లోకి ప్రవేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 30 మందికిపైగా మృతిచెందినట్లు తెలుస్తోంది.
మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు ఆఫ్ఘనిస్తాన్ కమాండోలు రంగంలోకి దిగారు. కమాండోలు ప్రత్యేక హెలికాప్టర్ లో హాస్పిటల్ పై దిగారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. హాస్పిటల్ పై దాడి చేసింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా తెలుస్తోంది.
సర్దార్ దౌడ్ హాస్పిటల్ లో మొత్తం 400 పడకలు ఉన్నాయి. ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మాట్లాడుతూ ఉగ్రవాదులు మానవ విలువలను మంటగలిపారని, హాస్పిటల్ పై దాడి చేయడమంటే అది దేశం మీద దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు.
మొన్నటి వరకు తాలిబన్ల దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆఫ్ఘనిస్తాన్ కు ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ సెగ కూడా తాకింది. ఇవాళ దాడికి దిగిన మిలిటెంట్లలో ఒకరు హాస్పిటల్ గేటు వద్దే తనను తాను పేల్చుకున్నాడు.
హాస్పిటల్ కాంపౌండ్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. రెండు, మూడో అంతస్తుల్లోకి చొరబడినట్లుగా అంచనా వేస్తున్నారు. డక్టర్ వేషంలో ఉన్న ఒక జిహాదీ తన చేతిలో ఉన్న ఏకే 47 గన్ తో విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నట్లు హాస్పటిల్ నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పాడు.
అతిపెద్ద మిలిటరీ హాస్పిటల్ పై మిలిటెంట్లు దాడికి దిగినట్లు ఇవాళ ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు ఒక సాయుధుడ్ని చంపేశారు. ఈ మొత్తం ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.