పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?
న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి.. సేకరిస్తున్నాయి. ఈ ఘటన దేశాన్ని బాధలో నింపింది. ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. సీఆర్పీఎఫ్ కుటుంబాలకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి.
అమెరికాలో ఉంటున్న వివేక్ పటేల్ ఈ ఘటనపై ఎంతో ఆవేదనకు లోనయ్యారు. నలభై మందికి పైగా ఆర్మీ జవాన్లు అమరులవ్వడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. అమర జవాన్ల కుటుంబం కోసం వివేక్ పటేల్ (26) రూ.5 కోట్లు విరాళాలు సేకరించారు. వివేక్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన యువకుడు. అతను సీఆర్పీఎఫ్ కుటుంబాలకు తనవంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాడు.
భారత్ కే వీర్ వెబ్సైట్ ఓపెన్ చేసినా
తాను సేకరించిన మొత్తాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లకు ఇవ్వడం కోసం వివేక్ పటేల్ ప్రభుత్వ వెబ్సైట్ భారత్ కే వీర్ (Bharat Ke Veer)ను ఓపెన్ చేశారు. కానీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటర్నేషనల్ కార్డ్స్ను యాక్సెప్ట్ చేయేదు. వివేక్ వద్ద ఉన్న అమెరికాకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించలేదు. దీంతో అతను తాను ఇవ్వాలనుకున్న విరాళం ఇవ్వలేకపోయారు. అంతేకాదు, విరాళాలు వస్తుండటంతో వెబ్ సైట్ డౌన్ అయింది. విదేశాల్లో ఉన్న వారు ఇవ్వలేకపోతున్నారని గ్రహించారు. దీంతో విరాళాలు సేకరించడం ప్రారంభించారు.
యూరి సినిమా చూసి
సంఘటన జరిగిన గురువారం నాడు అతను యూరీ - ది సర్జికల్ స్ట్రయిక్స్ సినిమాను చూశాడు. ఆ తర్వాత పుల్వామా ఘటన నేపథ్యంలో అమరవీరుల కుటుంబాల కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. సాధ్యమైనంత ఎక్కువ విరాళాలు సేకరించాలని భావించారు. ఇందుకు ఫేస్బుక్ మంచి వేదిక అని భావించారు. అతను 5 లక్షలు అమెరికా డాలర్ల విరాళం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడి సమయం ప్రకారం ఫిబ్రవరి 14, అమెరికా సమయం ప్రకారం ఫిబ్రవరి 15న విరాళాల సేకరణ ప్రారంభించారు.
విరాళాల సేకరణ
వివేక్ పటేల్ వర్జీనియాలో సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా ఉన్నారు. అతను ఫేస్బుక్ ద్వారా, తన స్నేహితుల ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. కేవలం 12 గంటల్లో అతను 2,52,000 డాలర్లు వచ్చాయి. ఆ తర్వాత నాలుగు రోజుల్లో 5,00,000 డాలర్లు సేకరించారు. అతను మొత్తం 8,04,747 డాలర్లు సేకరించారు. భారతీయ కరెన్సీలు ఇది రూ.5.75 కోట్ల వరకు ఉంటుంది. కాగా, ఫేస్బుక్ ద్వారా విరాళాల సేకరణ భారత్లో అందుబాటులో లేదు. ప్రస్తుతానికి ఫేస్బుక్ ద్వారా డొనేషన్లు కేవలం అమెరికా డాలర్లలోనే ఉంది.
ఎన్నారైలు విరాళాలు ఇవ్వలేకపోతున్నారు
భారత్ కే వీర్ ఇంటర్నేషనల్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. దీంతో ఎవరైనా ఎన్నారైలు సాయం చేయాలనుకున్నప్పటికీ చేయలేకపోతున్నారు. విరాళాలు ఇవ్వడం లేదా సేకరించడం మినహా నేరుగా ఇవ్వలేని పరిస్థితి ఎన్నారైలది. కాబట్టి భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ కార్డ్స్ కూడా 'భారత్ కా వీర్' యాక్సెప్ చేసేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వివేక్ పటేల్ మాట్లాడుతూ.. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడాల నుంచి తనకు సాయం చేస్తామని పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కాగా, ఫేస్బుక్ ద్వారా విరాళాల సేకరణకు ఎన్జీవో కావాలి. కానీ వివేక్ మాత్రం తన పేరుపైనే ఈ డబ్బును సేకరించారు.
మనమంతా భారతీయులం
సోమవారం రాత్రి వరకు 21వేల మంది సీఆర్పీఎఫ్ కుటుంబాల కోసం విరాళాలు ఇచ్చారు. చికాగోలోని ఇండియన్ రేడియో స్టేషన్ అతనిని ఆహ్వానించింది. అక్కడ అతను శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ మనమంతా భారతీయులమని, మన సైనికులు చేసిన త్యాగానికి వారి కుటుంబాలకు ఏదైనా చేద్దామని అతను పిలుపునిచ్చారు.