క్రేజీ వీడియో: న్యూస్ బదులు జ్యూస్ ..ఈ ఛానెల్ యాంకర్లపై విమర్శలు.. ఏ ఛానెల్ అంటే..!
ఇస్లామాబాద్: ఈ మధ్యకాలంలో వార్తా ఛానెళ్లు ఎక్కువైపోయాయి. న్యూస్ ఛానెల్స్కు విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇందుకోసం సదరు ఛానెల్ యాజమాన్యాలు రేటింగ్స్ పెంచుకునేందుకు ఎంత దూరమైనా వెళుతున్నారు. అంతేకాదు క్రియేటివిటీ పేరుతో ఇదేం ఖర్మరా బాబు అనేలా వ్యవహరిస్తున్నారు. రెవిన్యూ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. అసలే కరోనా సమయంలో లాక్డౌన్ అమలులోకి రావడంతో చాలా వరకు న్యూస్ ఛానెల్స్కు రెవిన్యూ తగ్గిపోయింది. యాడ్స్ కూడా లేవు. ఇక రెవిన్యూ పెంచుకునేందుకు న్యూస్ ఛానెల్స్లో వార్తలు చదవాల్సిన యాంకర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే నోరెళ్ల బెడతారు. ఇదేం పైత్యంరా నాయనా అని అనుకోక మానరు. ఇంతకీ ఆ న్యూస్ యాంకర్లు ఎవరు.. వారు ఏ ఛానెల్కు చెందిన వారు..?
పాక్ న్యూస్ ఛానెల్ తీరుపై విమర్శలు
రెవిన్యూ కోసం ఏదైనా చేస్తారు... టీఆర్పీ కోసం ఎందాకైనా వెళతారు.. అని చెప్పేందుకు ఈ తాజా ఘటనే ఉదాహరణ. పాకిస్తాన్లోని అబ్ తక్ అనే న్యూస్ ఛానెల్ డబ్బుల కోసం మరీ సిల్లీగా వ్యవహరించింది. న్యూస్ చదవాల్సిన ఆ ఛానెల్ యాంకర్లు బులిటెన్ ప్రారంభంకాగానే జ్యూస్ తాగుతూ కనిపించారు. దీంతో ఏదో టెక్నికల్ సమస్య అనుకున్నారు వీక్షకులు. కానీ కాదు. ఓ జ్యూస్ కంపెనీని ప్రమోట్ చేసే క్రమంలో ఈ యాంకర్లు ఆ కంపెనీ జ్యూస్ను తాగుతూ న్యూస్ ఎంజాయ్ చేయండంటూ చెప్పారు. ఇప్పుడు ఇదే హాట్టాపిక్ అయ్యింది. ఇలా జ్యూస్ తాగుతున్న ఆ యాంకర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఇదేం ఖర్మరా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
న్యూస్ బదులు జ్యూస్
ఇక సోషల్ మీడియాలో పోస్టు అయిన వీడియోను ఒకసారి చూద్దాం. న్యూస్లో సాధారణంగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం అని యాంకర్లు చెప్పడం సర్వసాధారణం. అయితే ఈ వీడియోలో మాత్రం బ్రేక్ తర్వాత తిరిగి స్క్రీన్పై కనిపించిన యాంకర్లు వీక్షకులకు తిరిగి స్వాగతం అని చెబుతూ జ్యూస్ తాగుతూ కనిపించారు. చేతిలో జ్యూస్ డబ్బాను చూసిన వీక్షకులు ఖంగుతిన్నారు. అంతేకాదు మంచి ఆరోగ్యానికి ఈ జ్యూస్నే తాగండంటూ చెప్పడం మరో కొసమెరుపు. యాంకర్లు జ్యూస్ను ప్రమోట్ చేయడం ఏంటో అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు. వీరికి వృత్తిపై గౌరవం లేదంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం రేటింగ్స్ పెంచుకునేందుకు ఇదో వినూత్న ప్రయోగం అంటూ కామెంట్ చేశారు.
Recommended Video
నెటిజెన్లు ఆగ్రహం
మరో పాకిస్తాన్ రిపోర్టర్ మాత్రం వీరిపై విరుచుకుపడ్డారు. బులిటెన్ చదివే సమయంలో జ్యూస్ అమ్మడమేంటి చెండాలంగా అంటూ కామెంట్ చేశారు. మరొకరు మాత్రం ఇది న్యూస్ యాంకర్ల తప్పు కాదని వారితో ఇలా చేయించిన యాజమాన్యంది తప్పని చెప్పారు. వారి ఉద్యోగం కాపాడుకోవాలంటే యాజమాన్యం చేయించే ఇలాంటి పనులన్నీ చేయక తప్పదంటూ జాలి పడ్డారు. ఇదిలా ఉంటే మార్కెటింగ్ చేసుకోవడంలో తప్పేముంది... నెస్లీ డబ్బులు చెల్లిస్తోంది.. అందుకే ఆ ఛానెల్ యాజమాన్యం ప్రమోట్ చేస్తోందంటూ కామెంట్ చేశారు. అయితే చాలామంది మాత్రం అబ్ తక్ ఛానెల్ తీరును తప్పుబడుతున్నారు.