అమెరికా.. ఇదీ మా సత్తా! తాజా క్షిపణి ప్రయోగంతో స్పష్టమైన సంకేతం, ఇక టార్గెట్ అదే!
ఉత్తర కొరియా తాజా మిస్సైల్ ప్రయోగంపై అమెరికా కూడా విశ్లేషణ జరిపింది. తాజా క్షిపణి ప్రయోగం ద్వారా ఉత్తరకొరియా తన సత్తా ఏమిటో అమెరికాకు తెలిపే సంకేతాన్ని పంపినట్లయిందని అంటున్నారు.
వాషింగ్టన్: ఉత్తరకొరియా తాజాగా జరిపిన న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అమెరికా ప్రోద్బలంతో ఐక్యరాజ్య సమితి కఠిన ఆంక్షలు విధించినా కూడా ఉత్తరకొరియా ఏమాత్రం తగ్గకపోవడంపై అన్ని దేశాలూ ఆందోళనతో ఉన్నాయి.
మరోవైపు ఉత్తర కొరియా శుక్రవారం తెల్లవారుజామున జరిపిన మిస్సైల్ ప్రయోగంపై అమెరికా కూడా విశ్లేషణ జరిపింది. అందులో కొన్ని వాస్తవాలు వెలుగుచూశాయని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. మాజీ సైనికాధికారులు కూడా ఆ నిజాలను అంగీకరిస్తున్నారు.
ఇది పక్కా ప్రయోగం...
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకొరియా.. జపాన్ మీదుగా పసిఫిక్ మహా సముద్రంలోకి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు జరపడం కొత్తేమి కాకపోయినా శుక్రవారం నాటి ప్రయోగం మాత్రం ముందు జరిపిన వాటి కంటే చాలా పక్కాగా ఉన్నట్లు అమెరికా మిలిటరీ అధికారులు పేర్కొంటున్నారు.
Recommended Video
అమెరికాకు సవాల్ విసిరినట్లే...
అమెరికా అధీనంలో ఉన్న ద్వీప ప్రాంతం గువామ్కు అత్యంత సమీపంగా ఉత్తర కొరియా తన బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించి అమెరికాకు సవాలు విసిరిందని చెబుతున్నారు. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్ గరిష్ఠంగా 2300 మైళ్ల కంటే ఎత్తులో 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫసిపిక్ మహసముద్రంలో పడిపోయిందని చెబుతున్నారు. ఈ తాజా మిస్సైల్ లాంచ్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వివరించారు.
ఇది సత్తా చూపించే సంకేతమే...
ఇంతకాలం ఉత్తరకొరియా ఏదో పిల్లిమొగ్గలు వేస్తుందనే అధ్యక్షుడు ట్రంప్ సహా అమెరికా మిలిటరీ అధికారులు భావించారు. కానీ శుక్రవారం జరిపిన మిస్సైల్ ప్రయోగాన్ని గనుక గమనిస్తే... ఉత్తరకొరియా కచ్చితంగా అమెరికాను టార్గెట్ చేసుకునే ఈ ప్రయోగాలు జరుపుతోందని, దానికి అమెరికాపై దాడి చేసే సామర్థ్యం ఉందని, తాజాగా చేపట్టిన క్షిపణి ప్రయోగం ద్వారా ఆ మేరకు ఉత్తరకొరియా సంకేతాన్ని పంపినట్లయిందని అంటున్నారు.
అమెరికాపై ఏ క్షణంలోనైనా దాడి...
ఇప్పటివరకు ఉత్తరకొరియాకు అంత సామర్థ్యం లేదనుకుంటున్న అమెరికాకు ఇది నిజంగా కలవరపెట్టే విషయమని మాజీ సైనికాధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఉత్తరకొరియా ఏ క్షణంలోనైనా అమెరికా ద్వీప ప్రాంతమైన గువామ్తోపాటు అమెరికా ప్రధాన భూభాగాలపై దాడి చేసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ఉత్తరకొరియా ఏదో భారీ ప్లాన్ లోనే ఉంది...
నిజానికి ఆగస్టు మొదటి వారంలోనే అమెరికా ద్వీప ప్రాంతమైన గువామ్పై దాడి చేస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా ఇన్ని రోజులు మౌనంగా ఉండటం వెనుక ఏదైన వ్యూహం ఉందేమోనని సైనికాధికారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఉత్తరకొరియా ఏదో భారీస్థాయిలోనే పథకం రచిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉలిక్కిపడిన జపాన్...
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరపగానే జపాన్ లో సైరన్ లు ఒక్కసారి మోగాయి. మిలిటరీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వార్త వార్త ప్రసారం కాగానే.. జపాన్ ప్రజలు కూడా భయాందోళనలకు గురయ్యారు. అంతకుముందు రోజే అణ్వస్త్రాలతో జపాన్ను ముంచేస్తాం.. అమెరికాను బూడిద చేస్తాం.. అంటూ ఉత్తరకొరియా హెచ్చరించింది. ఆ మరుసటి రోజే ఉత్తరకొరియా అన్నంతపనీ చేసింది. నెల రోజుల వ్యవధిలో రెండోసారి జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. దీంతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సహనం కోల్పోయిన షింజో అబె...
ఉత్తరకొరియా చర్యలతో జపాన్ సహనం కోల్పోయింది. తన దేశం మీదుగా మరో క్షిపణి ప్రయోగం జరపడంపై ఆ దేశ ప్రధాని షింజో అబె తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇక సహించేది లేదని, ఉత్తరకొరియా ఆగడాలు శృతిమించాయని, తాము కూడా తగిన స్థాయిలో సమాధానం చెబుతామని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఉత్తరకొరియా తన తీరును ఇలాగే కొనసాగిస్తే.. ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు. ఈ విషయాన్ని ఉత్తరకొరియాకు అర్థమయ్యేలా చెప్తాం' అని షింజో అబే తన అసహనాన్ని వెళ్లగక్కారు.
ఇక మిగిలింది.. యుద్ధమే...
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తాజా ఆంక్షలను సైతం లెక్కచేయకుండా ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగం జరపడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తాజా ఘటనపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శుక్రవారం ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అమెరికా, జపాన్ ఈ సమావేశం ఏర్పాటుచేయాలని కోరాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు అత్యవసర సమావేశం జరిగింది. అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా దుయ్యబట్టారు. ‘అయిందేదో అయిపోయింది. ఇప్పుడిక జరగాల్సింది చూద్దాం.. శాంతి, సామరస్య పూర్వక వాతావరణం ఇప్పుడిక లేదు.. ఆంక్షలూ ఫలితమివ్వడం లేదు.. ఇక మిగిలింది యుద్ధమే..' అంటూ వ్యాఖ్యానించారు.