జరభద్రం: ఈ పాస్వర్డ్ మీదైతే మీ ఆన్లైన్ అకౌంట్కు ముప్పువాటిల్లినట్లే..!
ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు తమ ఆన్లైన్ ఖాతాలకు వినియోగిస్తున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా..? అత్యంత భద్రతతో కూడి ఉండాల్సిన పాస్వర్డ్ను కంప్యూటర్పై ఓ మాదిరి అవగాహన ఉన్న వ్యక్తి కూడా చోరీ చేసే అవకాశం ఉంది. పాస్వర్డ్ను చాలా సింపుల్గా పెట్టుకోవడం వల్ల హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఫలితంగా ఒకరి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసుకోవడం ఒకరి అకౌంట్ నుంచి అత్యంత కీలకమైన సమాచారం దొంగలించడంలాంటివి చేస్తున్నారు. పాస్వర్డ్ను ఫిక్స్ చేసుకోవడంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించకపోతే నష్టం తప్పదు. తాజాగా యునైటెడ్ కిండమ్కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ తొలిసారిగా యూకే సైబర్ సర్వే పేరుతో ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో పాస్వర్డ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
పాస్వర్డ్పై పరిశోధనలు చేసిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్
పాస్వర్డ్.. కంప్యూటర్ అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ ఈ పదం తెలిసే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారందరికీ ఇది సుపరిచితమే. సోషల్ మీడియా వాడుతున్న వారందరికీ పాస్వర్డ్ గురించి కనీస అవగాహన ఉంటుంది. వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలియకుండా లాక్ చేయగలిగేదే పాస్వర్డ్ అంటాము. ఇక పాస్వర్డ్ ఎంత క్లిష్టంగా పెట్టుకుంటే అంత మంచిది. ఖాతాలకు ఇతర సోషల్ మీడియా అకౌంట్లకు పెట్టుకున్న పాస్వర్డ్ను మర్చిపోకూడదు. అయితే యూకేలోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ మాత్రం ప్రపంచంలో చాలామంది తమ వ్యక్తిగత ఖాతాలకు పాస్వర్డ్ను 123456గా పెట్టుకున్నట్లు తన పరిశోధనలో వెల్లడైనట్లు ఓ నివేదిక విడుదల చేసింది.
కామన్ పాస్వర్డ్తో తిప్పలు తప్పవు
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులు ట్రాయ్ హంట్తో కలసి చేపట్టిన పరిశోధనల్లో ఆన్లైన్ అకౌంట్ మెయిన్టెయిన్ చేసేవారు సర్వసాధారణంగా పెట్టుకునే లక్ష పాస్వర్డ్లను ఈ సంస్థ గుర్తించగలిగింది. ఇలా కామన్ పాస్వర్డ్లు పెట్టుకోవడంతో కొన్ని వేల ఖాతాలు హ్యాకింగ్కు గురై వ్యక్తిగత సమాచారం, డబ్బులు లాంటివి హ్యాకర్లు దొంగలిస్తున్నారని నివేదికలో పేర్కొంది. యూకే ప్రభుత్వం తలపెట్టిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కోసం నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ మరియు డిజిటల్ కల్చర్ శాఖ మీడియా అండ్ స్పోర్ట్ విభాగాలు సంయుక్తంగా పరిశోధనలు చేశాయి.
ఈ పాస్వర్డ్లు ఎక్కువ మంది వినియోగిస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా 23.2 మిలియన్ ఆన్లైన్ అకౌంట్లకు పాస్వర్డ్ 123456 ఉన్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు. ఇక 123456789 పాస్వర్డ్ దాదాపు 7.7 మిలియన్ ఆన్లైన్ అకౌంట్లకు ఉన్నట్లు స్పష్టం చేసింది. password అనే ఈ పదం పాస్వర్డ్గా ఉన్న అకౌంట్లు 3.6 మిలియన్ ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాదు 3.1 మిలియన్ యూజర్లు 1111111ను పాస్వర్డ్గా పెట్టుకున్నట్లు తమ నివేదికలో పొందుపర్చింది నేషనల్ సైబర్ సెక్యూరిటీ. పాస్వర్డ్ ఇతరులు ఊహించేందుకు కష్టతరంగా ఉండాలని అదే సమయంలో గుర్తుపెట్టుకునేలా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
పాస్వర్డ్స్లో అభిమాన సింగర్స్ పేర్లు
ఇక ఆష్లే, మైఖేల్, డేనియల్, జెస్సికా చార్లీలాంటి కామన్ పేర్లను పాస్వర్డ్గా వినియోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక ప్రముఖ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టీమ్ పేర్లు అయిన లివర్పూల్, చెల్సియా, ఆర్సెనల్, మాంచెస్టర్ యునైటెడ్, ఎవర్టన్లు కూడా పాస్వర్డ్గా వినియోగించుకున్నట్లు నివేదిక వివరించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు తమ అభిమాన సింగర్స్ పేర్లను కూడా పాస్వర్డ్లుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బ్లింక్ 182, 50 సెంట్, ఎమినెమ్, మెటాలికా, స్లిప్నాట్ పేర్లను పాస్వర్డ్ కాంబినేషన్లో చేర్చినట్లు నివేదిక తెలిపింది. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ మధ్యకాలంలో సీరియస్ అంశంగా పరిగణించబడుతోంది. అందుకే హ్యాకర్లు ఊహించేలా పాస్వర్డ్ ఉండకుండా ఈమెయిల్ అకౌంట్కు బలమైన క్లిష్టమైన పాస్వర్డ్ను సెట్ చేసుకుంటే వారి బారినుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు యూకే డిజిటల్ మరియు క్రియేటివ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి మార్గట్ జేమ్స్.
పాస్వర్డ్ సెట్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉన్న యువత
ఇప్పటి యువతరం పాస్వర్డ్ను సెట్ చేసుకోవడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని నివేదిక కితాబిచ్చింది. తాము షేర్ చేస్తున్న సమాచారంపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నారని అదే సమయంలో ఆన్లైన్ అకౌంట్స్ వినియోగిస్తున్నప్పుడు ప్రైవసీ పై అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. 21 శాతం మంది ఆన్లైన్ ఖాతాలు వినియోగిస్తున్న సమయంలో సోషల్ మీడియాను ఓపెన్ చేయరని చెప్పినట్లు తెలిపిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ... స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న వారిలో ప్రపంచవ్యాప్తంగా 70శాతం మంది పిన్ నెంబరును సెట్ చేసుకున్నారని పేర్కొంది.
మొత్తానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే హ్యాకర్ల నుంచి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాస్వర్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేలా సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్లనుంచి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉండదనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.