ప్రపంచంలోనే అతి ఖరీదైన ఈ పెయింటింగ్ ఎక్కడ దొరికిందో తెలుసా..?
న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యంత ధర పలికిన పెయింటింగ్ ఒకటి సౌదీ అరేబియా రాజు మొహ్మద్ బిన్ సలామ్ ప్రయాణించే నావలో ఉందని లండన్కు చెందిన ఆర్ట్ డీలర్ కెన్నీ స్కాచ్టర్ చెప్పారు. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ నుంచి జాలువారిన సాల్వేటర్ ముంది అనే ఈ పెయింటింగ్ రికార్డు స్థాయిలో 450 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అయితే ఇది అమ్ముడు పోయిన నాటి నుంచి ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియకుండా పోయింది.
మొత్తానికి ఓ మిస్టరీలా మిగిలిపోయింది. సోమవారం ఆర్ట్ డీలర్ కెన్నీ ఓ వెబ్ సైట్ కు రాస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు.2017 క్రిస్టీస్లో జరిగిన వేలం పాటలో ఈ అద్భుతమైన చిత్రం అత్యధిక ధర పలికింది. జీసస్ క్రైస్ట్ చీకటిలోనుంచి వెలుగులోకి ప్రవేశించి ప్రపంచాన్ని ఓ చేత్తో దీవిస్తున్నట్లుగా డావిన్సీ చిత్రించారు. మరో చేతిలో ఓ గ్లోబ్ను పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.అయితే ఈ పెయింటింగ్ను బహిరంగ ప్రదర్శనకు ఎప్పుడూ ఉంచలేదు.
ఇది ఎవరి దగ్గర ఉందో, దీనికి సంబంధించి ఇతరత్ర విషయాలు ఎవ్వరికీ తెలియలేదు. అయితే తాజాగా బయటపడ్డ పెయింటింగ్పై పలువురు చిత్రకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది డావిన్సీ వేసిన పెయింటింగేనా అనే అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయన నడిపిన వర్క్షాప్ వారు వేసి ఉంటారని డావిన్సీ ఈ చిత్రాన్ని గీసి ఉండరనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ పెయింటింగ్ను సౌదీ రాజు బాదర్ బిన్ అబ్దుల్లా కొనుగోలు చేసినట్లు తొలుత వాల్స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక కథనం ప్రచురించింది. అయితే రాజు కానీ అతని సన్నిహితులు కానీ ఎవరూ దీన్ని నిర్థారించలేదు. మధ్యతూర్పు దేశాలు ఇలాంటి పెయింటింగ్స్ కొనుగోలు చేసేప్పుడు వీటిని బహిరంగ పరచవని ఆర్ట్ డీలర్ కెన్నీ చెప్పారు. బహుశా అందుకే దీని జాడ గురించి ప్రపంచానికి తెలియకపోయి ఉండొచ్చని తన కాలమ్లో రాశారు. ఈ పెయింటింగ్కు సంబంధిచిన వేలంపాట అర్థరాత్రి జరిగిందని మొహ్మద్ బిన్ సల్మాన్తో పాటు మరో ఇద్దరు ఈ పెయింటింగ్ను కొనుగోలు చేసేందుకు పోటీ పడినట్లు తెలిపారు.
ఇక పెయింటింగ్ను దక్కించుకున్న రాజు వెంటనే తన విమానంలో తీసుకెళ్లారని ఆ తర్వాత తన వ్యక్తిగత ఓడలో దాన్ని ఉంచారని ఆర్ట్ డీలర్ కెన్నీ తన వెబ్సైట్లో రాసుకున్నారు. సౌదీలోని అల్-ఉలా గవర్నరేట్కు ఈ పెయింటింగ్ తరలిస్తారని... ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక మరియు పర్యాటకంగా అభివృద్ధి చేసిన తర్వాత పెయింటింగ్ను అక్కడకు తరలిస్తారని చెప్పిన కెన్నీ... అప్పటి వరకు ఇది రాజు నౌకలోనే ఉంటుందని స్పష్టం చేశారు.