ఈ చిన్నారి చెస్ ఛాంపియన్ను దేశం విడిచి వెళ్లమన్నారెందుకు..?
భారత సంతతికి చెందిన కుర్రాడు ఇంగ్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో ఇబ్బందులకు గురవుతున్నాడు. తన తండ్రి ఆదాయం భారత కరెన్సీలో రూ.కోటి 60 లక్షలకు తక్కువగా ఉందని అక్కడి అధికారులు వెంటనే దేశాన్ని విడిచివెళ్లాల్సిందిగా ఆ కుటుంబాన్ని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే... శ్రేయాస్ రాయల్ అనే కుర్రాడు బ్రిటన్లో చాలామందికి ఒక చెస్ ఛాంపియన్గా తెలుసు. బ్రిటన్ తరపున ఎన్నో చెస్ టోర్నమెంటుల్లో పాల్గొన్న శ్రేయాస్... ఎన్నో విజయాలను అందించాడు.
శ్రేయాస్ రాయల్ తండ్రి జితేంద్రసింగ్ టీసీఎస్ కంపెనీ తరపున బ్రిటన్లో పనిచేస్తున్నాడు. అయితే తన సంవత్సరం ఆదాయం రూ.కోటి 60 లక్షలకు తక్కువగా ఉన్నందున అక్కడి నిబంధనల ప్రకారం బ్రిటన్లో ఉండేందుకు అనుమతి ఉండదని జితేంద్రసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడు భారత్లో పుట్టినప్పటికీ... మూడేళ్ల వయసులోనే బ్రిటన్కు వచ్చేశాడని బ్రిటన్ దేశంలోనే చెస్ నేర్చుకుని ప్రస్తుతం తన వయస్సున్న గ్రూపులో ప్రపంచంలో నాలుగవ ర్యాంకులో కొనసాగుతున్నాడని జితేంద్ర సింగ్ తెలిపాడు.
బ్రిటన్ హోంశాఖ అధికారులకు శ్రేయాస్ గురించి చెప్పినప్పటికీ వారు వినడం లేదని జితేంద్ర చెప్పాడు. శ్రేయాస్ జాతీయ ఆస్తిని తాను చెప్పినట్లు జితేంద్ర తెలిపాడు. అయితే ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉండరాదని అధికారులు చెబుతున్నట్లు జితేంద్ర చెప్పాడు. ఇంగ్లాండ్లోనే తన కుమారుడి ప్రతిభ బయటపడిందని... ఇంగ్లాండ్లో తన కొడుకుకు లభిస్తున్న మద్దతు ఆదరణ భారత్లో లభించదని జితేంద్ర చెప్పాడు. శ్రేయాస్ రాయల్ బ్రిటన్లోనే చెస్ ఆడటం నేర్చుకున్నాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఇంగ్లండ్ తరుపునే బరిలోకి దిగాడని తండ్రి చెబుతున్నాడు. ప్రస్తుతం బ్రిటీష్ చెస్ ఛాంపియన్లో పాల్గొంటున్న శ్రేయాస్కు బహుశా ఇదే చివరి టోర్నమెంటు కావొచ్చేమో...
అయితే సోషల్ మీడియాలో శ్రేయాస్ కష్టాన్ని తెలుసుకున్న నెటిజెన్లు చిన్నారికి అతని కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు. శ్రేయాస్ ఇంగ్లాండ్లోనే ఉండాలన్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అంతేకాదు భారత విదేశీ మంత్రిత్వశాఖ నుంచి శ్రేయాస్ ఇంగ్లాండ్లోనే ఉండేలా ఏమైనా సహాయం చేయగలరేమో అడిగి ప్రయత్నించండి అంటూ కొందరు ట్వీట్స్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు భారత మేధావులు జోక్యం చేసుకోవాలని చెబుతూనే ఈ కుర్రాడిలో మరో విశ్వనాథన్ ఆనంద్ను చూడొచ్చు అని కూడా ట్వీట్ చేస్తున్నారు నెటిజెన్లు.