ఇది కథ కాదు: 68ఏళ్ల తర్వాత ఈ తల్లీ కొడుకులను విధి కలిపింది
ఇదో వాస్తవ కథ... విధి తల్లిని కొడుకును వేరు చేసిన నిజమైన కథ. అదే విధి తిరిగి ఇద్దరిని ఒకే గూటికిందకు చేర్చింది. ఇది మన దేశంలో జరిగిన కథ కాదు... దక్షిణకొరియాలో చోటుచేసుకున్న యదార్థ సంఘటన. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 68 ఏళ్ల తర్వాత తల్లీ కొడుకు తిరిగి కలుసుకున్నారు. వారి ఆనందానికి హద్దుల్లేవు. అమ్మ స్పర్శను 68 ఏళ్ల తర్వాత అనుభవించిన ఆ కొడుకు కళ్లవెంట కన్నీళ్లు ఆగలేదు. కన్న కొడుకుకు కోసం ఆ తల్లి పడ్డ ఆవేదన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 68 ఏళ్లు. ఈ తల్లీ కొడుకులు తిరిగి కలుసుకున్న దృశ్యం అక్కడ ప్రతి ఒక్కరిని కలచివేసింది.
వివరాల్లోకి వెళితే... ఆనాటి ఉమ్మడి కొరియా దేశంలో లీకెయుం సీయోం దంపతులు నివసించేవారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు. ఆనాడు జరిగిన యుద్ధం లీ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. యుద్ధం తర్వాత ఉత్తరకొరియా దక్షిణ కొరియా దేశాలుగా కొరియా దేశం విడిపోయింది. ఆ సమయంలో అక్కడి చాలా కుటుంబాలు లీ కుటుంబంలానే చెల్లాచెదురయ్యాయి.కొందరు ఉత్తర కొరియాలో ఉండిపోగా... మరికొందరు దక్షిణకొరియాలో మిగిలిపోయారు. ఇక అప్పటి నుంచి దక్షిణ కొరియా ఉత్తరకొరియా దేశాల మధ్య ఉన్న సరిహద్దు దాటి ఇటుగా కానీ అటుగా కానీ ఒక్క పురుగు వచ్చి వెళ్లేది కాదు. ఒకవేళ వచ్చినా ప్రాణాలతో బయటపడరు.
ఆ నాటి పరిస్థితుల మధ్య లీ అనే మహిళ తన కూతురుతో పాటు దక్షిణకొరియాలో ఉండిపోగా.... ఆమె భర్త తన కొడుకుతో పాటు ఉత్తరకొరియాలో ఉండిపోయారు. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య మాటల్లేవు.. మాట్లాడుకోవటాల్లేవు. ఆ తర్వాత 1985 నుంచి విడిపోయిన వారి కుటుంబ సభ్యులను లాటరీ పద్ధతిలో కలుసుకునేందుకు అనుమతించేవారు. ఇలా వచ్చిన అవకాశమే లీని తన కొడుకు రీ చెంతకు చేర్చింది. తన తల్లిని వదిలి తండ్రితో వచ్చేసినప్పుడు రీ వయస్సు నాలుగేళ్లు. మళ్లీ 68 ఏళ్ల తర్వాత తల్లీ కొడుకులు కలుసుకున్నారు. ఇప్పుడు తల్లి లీ వయస్సు 92 ఏళ్లుండగా... కొడుకు రీ వయస్సు 71 ఏళ్లు.తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్నాడు రీ.
తల్లి లీ ని కలుసుకున్న రీ చాలా ఉద్వేగానికి గురయ్యాడు. అంతే ఉద్వేగంతో తల్లి లీ కొడుకును హత్తుకుంది. వెంటనే ఎంతమంది పిల్లలు నీకు అని రీని అడిగింది. నీకు కొడుకు పుట్టాడా అంటూ అడిగింది. ఆ తర్వాత తన తండ్రి ఫోటో తీసి లీకి చూపించాడు కొడుకు రీ. చనిపోయేనాటికి ఆమె భర్త ఇలా ఉన్నాడంటూ ఆ ఫోటో తీసి లీకి చూపించాడు. దీంతో ఆమె కన్నీరుమున్నీరైంది. అన్ని రోజులు భర్త జ్ఞాపకాలతోనే బతికింది లీ. అసలు బతికాడో చనిపోయాడో కూడా ఆమెకు తెలియదు.
మొత్తానికి 1985 నుంచి ఇలా లాటరీ పద్దతిలో 20వేల మంది తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఒక్కటయ్యారు. కానీ గతంలో కొందరు తమవారిని కలుసుకునే సమయం సమీపిస్తున్న తరుణంలోనే మృతి చెందేవారు. లేదా తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారు. దీంతో వారు తమవారిని ఎప్పటికీ కలుసుకోలేకపోయారు. అయితే ఈ సారి జరిగిన కార్యక్రమానికి మాత్రం కొంత ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్లు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.