సెంచరీనే టార్గెట్!: 46ఏళ్లకే 35మంది పిల్లలు(వీడియో)
క్వెట్టా: తన లక్ష్యం సెంచరీ కొట్టడమేనంటున్నాడు ఓ పాకిస్థానీ. అదేదో క్రికెట్లోనే లేక వేరే విషయంలో అనుకుంటే పొరబాటే. 46ఏళ్ల అతనికి ఇప్పటికే 35మంది పిల్లలు ఉన్నారు. ఆ సంఖ్యను 100కు పెంచాలన్నదే తన ఏకైక లక్ష్యమని చెబుతున్నాడతను. తన మత ధర్మ ప్రకారం మరికొంత మంది సంతానాన్ని పెంచాలనుకుంటున్నట్లు చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్కు చెందిన సర్దార్ జాన్ మొహమ్మద్ ఖిల్జీ(46) మెడికల్ టెక్నీషియన్. ఆయనకు ఇప్పటికే ముగ్గురు భార్యలున్నారు. వీరందిరికీ కలిపి 35 మంది పిల్లలున్నారు. ప్రస్తుతం నాలుగో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. తన జీవిత లక్ష్యం వంద మంది పిల్లల్ని కనడమేనని చెబుతున్న జాన్.. త్వరలో నాలుగో పెళ్లి చేసుకుని లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమాగా చెబుతున్నాడు.
తన లక్ష్యానికి భార్యల మద్దతు కూడా ఉందని తెలిపాడు. తనకు 26 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు వివాహం చేశారని చెప్పాడు. ఆ తర్వాత ఏడాది ఐదు నెలల తేడాతో మరో ఇద్దరిని పెళ్లాడానని వివరించాడు. ఇందులో ఓ పెళ్లిని పెద్దలే చేయగా మరోటి ఫేస్బుక్ ద్వారా కుదిరిందని చెప్పుకొచ్చాడు.
కాగా, పాకిస్థాన్లో బహుభార్యత్వం తప్పుకాదు. ఇస్లాం ప్రకారం.. పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అయితే ముందుగా మొదటి భార్య, ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కాగా, 'బహు భార్యత్వంతో కుటుంబంలో అశాంతి తలెత్తే అవకాశం ఉంది. భార్యల మధ్య సయోధ్య లేకపోతే ఆ కుటుంబంలో గొడవలు నిత్యకృత్యమవుతాయి. పిల్లలు తమ తండ్రి ఎవరో తెలియక తికమక పడే అవకాశం ఉంది' అని మహిళా హక్కుల కార్యకర్త రఫియా జకారియా పేర్కొన్నారు. కట్టుకున్న అందరికీ ఆస్తి విషయంలోనూ సమాన న్యాయం చేసే అవకాశం భర్తకు ఉండకపోవచ్చని ఆమె అన్నారు.
ఇది ఇలా ఉండగా, 100మంది పిల్లలే లక్ష్యంగా పెట్టుకున్న జాన్ నెల ఖర్చు రూ.1.20లక్షలు. పాకిస్థాన్ సగటు కంటే ఇది దాదాపు పదిరెట్లు ఎక్కువ. అయితే తానింతవరకు తన పిల్లలను పెంచడంలో ఇబ్బందులు ఎదుర్కోలేదని, ఆర్థిక సమస్యలతో తానెప్పుడూ బాధపడలేదని జాన్ వివరించాడు. అయితే ఇంత మొత్తాన్ని మెడికల్ టెక్నీషియన్గా ఎలా సంపాదిస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశాడు. తాను కేవలం రూ. 250 ఫీజే తీసుకుంటానని, పేదలకు ఉచితంగా కూడా వైద్యం అందిస్తానని తెలిపాడు.
అల్లాహ్ తనకు అన్నీ ఇస్తాడన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. జాన్ పెద్ద కొడకు పేరు జాన్ ఎసా. వయసు 13 ఏళ్లు. తన తండ్రి లక్ష్యం గురించి తెలుసుకున్న ఎసా.. తాను వందమంది కంటే ఎక్కువ మందినే కంటానని ఇప్పటి నుంచే చెబుతుండటం గమనార్హం.
కాగా, తన పిల్లలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతుండడంతో.. జాన్ తన పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం తదితర వాటిపై ప్రభుత్వం దృష్టాసారించాలని, తనకు కావాల్సిన నిధులు సమకూర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ప్రభుత్వం ఆయన అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో తనకు భగవంతుడు ఉన్నాడని చెప్పుకొచ్చాడు. కాగా, తాను సంతానం పెంచడం కోసం పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్లు చెప్పాడు. వ్యాయామం కూడా చేస్తున్నట్లు తెలిపాడు. మరి అతని లక్ష్యంగా నెరవేరుతుందో లేదో వేచిచూడాలి.