మానవత్వం: ఆ రెస్టారెంటులో పేదలకు ఉచితంగా పిజ్జాలు
సాధారణంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో అక్కడక్కడ భిక్షాటన చేస్తున్న కొందరిని చూస్తూ ఉంటాం. కేవలం కడుపు నింపుకోవడం కోసం వారు రోజంతా యాచిస్తూ కనపడుతారు. కొందరైతే చెత్త బుట్టల దగ్గర ఏదైనా తినేందుకు దొరుకుతుందేమోనని ఎదురుచూస్తు ఉంటారు. ఈ దృశ్యం తలచుకుంటే నిజంగా బాధేస్తుంది. ఇలాంటి వారిని చూసినప్పుడు మనకు తోచింది ఎంతోకొంత ఇచ్చి సహాయం చేస్తాం. కానీ కొందరు మాత్రం వారికి ప్రతిరోజూ సహాయం చేస్తారు. వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తారు.
డస్ట్బిన్లో పడేసిన పిజ్జాలను తింటున్న యాచకులు
అమెరికాలోని ఉత్తర డకోటా ప్రాంతంలోని ఓ రెస్టారెంటు భిక్షాటన చేస్తున్నవారిని అక్కున చేర్చుకుంది. వారికి ప్రతిరోజు తమ రెస్టారెంట్లలో పిజ్జాలు బర్గర్లు తినే అవకాశం కలిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే లిటిల్ సీజర్స్ అనే రెస్టారెంట్ యజమానురాలు ప్రతిరోజు కొందరి యాచకులను తమ రెస్టారెంట్ బయట ఉండటం గమనించేది. ఏదైనా డస్ట్ బిన్లో తినుబండారాలు పడేస్తే వాటిని తీసుకొని ఆ యాచకులు తినేవారు. ఇది గమనించిన యజమానురాలి గుండె తరుక్కుపోయింది. వారికి ఏదైనా చేసి సహాయపడాలని భావించింది యజమానురాలు.
యాచకులను చూసి కదిలిపోయిన రెస్టారెంట్ యాజమాన్యం
తినడానికి తిండి లేక , ఉండటానికి ఇంత చోటు లేక ఆ పేదవాళ్లు పడుతున్న బాధ ఆ రెస్టారెంట్ యజమానురాలును కలచివేసింది. దీంతో యాచకులను రెస్టారెంట్ లోపలికి పిలిచి ఏమి కావాలో అది కడుపు నిండా తినండి అంటూ చెప్పింది. యజమానురాలు అలా చెప్పడంతో షాక్ అయ్యారు యాచకులు. అంతేకాదు తన షాపు డోరుకు ఒక నోటీసు కూడా అంటించింది యజమానురాలు. తమ రెస్టారెంట్లో పేదలకు కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నామంటూ తెలిపింది.
రెస్టారెంట్లో ఉచితంగా పిజ్జాలంటూ కనిపించే నోటీసు
"నివాసం ఉండేందుకు చోటు లేని వారికి, తినడానికి తిండి లేని వారికి తమ రెస్టారెంటులో ఆహారం ఉచితంగా అందజేస్తాము. చెత్తబుట్టలో పడేసిన ఆహారం తినొద్దు. ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు మనుషులు. చెత్తబుట్ట కంటే ఎంతో అమూల్యమైనవి మీ ప్రాణాలు. రెస్టారెంట్ పనివేళల్లో మీరు వచ్చి కడుపు నిండా భోజనం చేసి వెళ్లండి. మీ వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోము. ఎవరూ మిమ్మలను ప్రశ్నించరు" అని నోటీసును అంటించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజెన్లు ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పేదవారిని ఆదుకునేందుకు ఆ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు రెస్టారెంటుకు వచ్చిన వారు నోటీసును చూసి తమవంతు సహాయం కూడా చేస్తున్నారు.