అమ్మాయిలకు వేధింపులు: నకిలీ టైగర్ మెమన్ అరెస్ట్
కరాచీ: పాకిస్థాన్లో తలదాచుకుంటున్న 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ను ఆ దేశంలోని కరాచీలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా బుధవారం వార్తలు వచ్చాయి. ముంబై పేలుళ్ల కేసులో టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నెల రోజుల తర్వాత వెలువడ్డ ఈ వార్తకు భారతీయ మీడియాలో ప్రధానంగా ప్రచురితమైంది.
అయితే భారత మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకునేందుకు పాక్కు ఫోన్లు చేశారు. కాగా, అరెస్టయిన వ్యక్తి టైగర్ మెమన్ కాదని, అతని పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్న మరో వ్యక్తి అంటూ పాకిస్థాన్ సస్పెన్షన్కు తెరదించింది.
అసలు విషయానికొస్తే.. కరాచీలో ఫర్ఖాన్ అనే వ్యక్తి తాను టైగర్ మెమన్ అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా అమ్మాయిలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ విషయం పోలీసుల దృష్టికిరావడంతో ఫర్ఖాన్ను అరెస్ట్ చేశారు. దీంతో కరాచీ పోలీసులు అసలైన టైగర్ మెమన్ను అరెస్ట్ చేశారంటూ వార్త బయటకువచ్చింది. భారత్ మీడియా ప్రతినిధులు ఈ వార్తను నిర్ధారించుకునేందుకు ఫోన్లు చేయగా పాక్ అధికారులు అసలు విషయం చెప్పారు.
భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో టైగర్ మెమన్ ఉన్న సంగతి తెలిసిందే. 1993లో ముంబై పేలుళ్లలో 257 మరణానికి కారణమైన టైగర్ దేశం విడిచి దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత 1996 నుంచి పాకిస్థాన్లోనే టైగర్ మెమన్ ఉంటున్నాడు.