Kim Jong Un:సారీ చెప్పాను.. సాఫ్ట్గా ఉంటాననుకున్నారా.. దక్షిణ కొరియాకు కిమ్ వార్నింగ్..!
ఉత్తరకొరియా దక్షిణ కొరియా దేశాల మధ్య క్రమంగా నిప్పు రాజుకుంటోంది. దక్షిణకొరియా అధికారిని ఉత్తరకొరియా సైన్యం కాల్చి చంపడంపై దక్షిణకొరియా దేశంలో ఇటు ప్రజలు అటు రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఒక అధికారి సరిహద్దుల దిశగా వెళుతున్నాడని తెలిసి కూడా దక్షిణకొరియా సైన్యం అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఘటన పై ఉత్తరకొరియా అధ్యక్షుడు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కిమ్ జాంగ్ ఉన్ దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు.
Recommended Video
కిమ్ వార్నింగ్
సారీ చెప్పాను సాఫ్ట్గా ఉంటానని అనుకుంటున్నారేమో... బొమ్మ అంత లేదంటూ దక్షిణకొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. తమ సరిహద్దులోకి ఎవరైనా వస్తే పరిస్థితి ఊహించనంతగా ఉంటుందని గట్టి సంకేతాలు పంపాడు కిమ్ జాంగ్ ఉన్. మరోసారి దక్షిణ కొరియా నుంచి ఎవరైనా ఉత్తరకొరియావైపు కన్నెత్తి చూస్తే కనిపించకుండా పోతారంటూ కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించారు.కొద్ది రోజుల క్రితం దక్షిణకొరియా అధికారిని తమ సైన్యం చంపడంతో అందుకు కిమ్ జాంగ్ ఉన్ క్షమాపణ చెప్పాడు. ఓవైపు క్షమాపణ చెబుతూనే మరో వైపు గట్టి హెచ్చరికలు సైతం జారీ చేశాడు.
సరిహద్దుల్లో కనిపిస్తే పరిస్థితి ఊహించలేరు
దక్షిణ కొరియా నుంచి ఎవరో ఒక వ్యక్తి తమ సరిహద్దు వైపు దూసుకొస్తే సైన్యం ఇలానే వ్యవహరిస్తుందంటూ కిమ్ చెప్పాడు. ఉత్తరకొరియా సముద్ర జలాల్లోకి చొరబడితే అది ఎవరైనా సరే సహించేది లేదంటూ రియాక్షన్ ఇలానే ఉంటుందని కిమ్ చెప్పారు.పశ్చిమ సముద్రంలోని సరిహద్దు రేఖను దాటి తమ జలాల్లోకి ప్రవేశించే ప్రయత్నం దక్షిణకొరియా మానుకోవాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి చొరబాట్లు ఎక్కువైతే ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఉత్తరకొరియా స్పష్టం చేసింది. ఇక రెండు దేశాల మధ్య నమ్మకం, గౌరవం అనేవి చెడిపోకుండా తాము చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, తమ అధినేత కిమ్ కూడా తమకు ఇదే సూచించారని ఉత్తరకొరియా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోకూడదనే చాలా ఓర్పుతో సహనంతో ఉన్నామని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
మృతదేహం అప్పగిస్తాం
ఇదిలా ఉంటే తమకు దక్షిణ కొరియా అధికారి మృతదేహం దొరికితే తప్పకుండా అప్పగిస్తామని ఉత్తరకొరియా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మృతదేహం కోసం గాలిస్తున్నామని ఉత్తరకొరియా పేర్కొంది. మరోవైపు ఘటనపై రెండు దేశాలు సంయుక్త విచారణ చేపట్టాలని ఈ మేరకు ఉత్తరకొరియా సహకరించాలని దక్షిణకొరియా ప్రభుత్వం కోరింది. ఇక ఉత్తరకొరియా గట్టి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దక్షిణ కొరియా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.