అమెరికా ఎన్నికల్లో కలకలం- ఓటర్ల ఇళ్లకు చేరని బ్యాలెట్లు- పెన్సిల్వేనియాలో ఉత్కంఠ
సంచనాలు రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాజాగా మరో కలకలం రేగింది. ఆన్లైన్లో జరుగుతున్న ఎన్నికల ముందస్తు ఓటింగ్లో ఇప్పటికే భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. మిగతా వారంతా నవంబర్ 3న జరిగే పోలింగ్లో నేరుగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేయాల్సి ఉంది. వీరికి ఇళ్ల వద్దకే బ్యాలెట్ పేపర్లు పంపాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఈ బ్యాలెట్ పేపర్లు ఇంకా అందకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
జో బైడెన్ గెలిస్తే అమెరికా మరో వెనిజులా: ఆయన ఓ చెత్త అభ్యర్థి అంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని భావిస్తున్న నాలుగు కీలక రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో ఇంకా చాలా మంది ఓటర్లకు బ్యాలెట్ పేపర్లు అందలేదనే విషయాన్ని కౌంటీ ఎన్నికల డైరెక్టర్ నిర్ధారించారు. దీంతో ఓటర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారుతుందనే అంచనాల మధ్య ఓటర్లకు బ్యాలెట్లు అందకపోతే పరిస్ధితి ఏంటనే ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది. బ్యాలెట్లను ఓటర్లకు పంపడంలో ప్రధాన పాత్ర పోషించే తపాలాశాఖ అధికారులు ఈ విషయం తమకు తెలియదని చెప్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వాడుతున్న బ్యాలెట్లు తమకింకా అందలేదని పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీ నుంచే పది వేలకు పైగా ఫోన్కాల్స్ వచ్చాయని కౌంటీ ఎన్నికల డైరెక్టర్ చెప్తున్నారు. ఇందులో ఒకే ఓటరు ఒకటి కంటే ఎక్కువ సార్లు కాల్ చేసినవి కూడా ఉన్నాయని ఆయన చెప్తున్నారు. తపాలాశాఖకూ, వీటిని పంపే పిట్స్బర్గ్ రవాణా వర్గాలకూ మధ్య ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. నార్త్ పిట్స్బర్గ్లో ఉన్న బట్లర్ కౌంటీలో దాదాపు లక్షన్నర ఓట్ల కోసం అభ్యర్ధనలు అందాయి. మొన్న ఒక్క గురువారమే ఇందులో 40 వేల బ్యాలెట్లు పంపితే అందులో 21300 బ్యాలెట్లు తిరిగొచ్చాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు బ్యాలెట్లు అందలేదనే ఫిర్యాదులు ఎక్కువవుతతున్నాయి. వీరికి ఏదో విధంగా మెయిల్ ద్వారా కానీ ఇతర మార్గాల్లో బ్యాలెట్ అందజేస్తామని అధికారులు చెప్తున్నారు.