నిరసనల సెగ: మసీదు కూల్చాలన్న ఆలోచన విరమించుకున్న చైనా ప్రభుత్వం
చైనా: చైనాలో ఓ మసీదును కూల్చాలన్న ఆలోచన అక్కడి ప్రభుత్వం విరమించుకుంది. కొన్ని వేల మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో ప్రభుత్వం మసీదును కూల్చివేయాలన్న ఆలోచన విరమించుకుంది. మతాలను ఎలా పాటించాలనేదానిపై ప్రభుత్వం ఓ రూపునిచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి ముస్లిం ప్రజలు నిరసన తెలిపారు. వీరంతా ప్రభుత్వం కూల్చాలని భావిస్తున్న మసీదు దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు.
ముస్లింలు నిరసనలు తెలిపేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో స్థానిక మత పెద్ద అందరిని తిరిగి ఇళ్లకు వెళ్లాలని కోరారు. కొత్తగా కట్టిన మసీదును ప్రభుత్వం కూల్చబోదని హామీ ఇచ్చారు. ఒకవేళ కూల్చాలని భావిస్తే దాని బదులు మరొకటి కట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చైనాలోని ఇతర మతాలన్నీ చైనా సంస్కృతిని ఫాలో కావాలన్న ఉద్దేశంతో అది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు లోబడి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
కూల్చాలని భావిస్తున్న మసీదు వెజౌ రాష్ట్రంలో ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మసీదును కూల్చాలని జిన్పింగ్ ప్రభుత్వం ఆగష్టు 3వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. జిన్పింగ్ ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ... కట్టిన మసీదుకు సరైన అనుమతులు లేవని సాకు చూపుతూ వెజౌ ప్రభుత్వం ఆగష్టు 10లోగ కూల్చేయాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మతపెద్దలు రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు తర్వాత మసీదును కూల్చాలన్న ఆలోచన విరమించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త మసీదు నిర్మాణం గతేడాది పూర్తయింది. అంతకుముందు 600 ఏళ్ల క్రితం చైనా కట్టడం తరహాలో అక్కడ మసీదు ఉండేది.అది చైనా సంస్కృతి విప్లవంలో భాగంగా అప్పుడు అన్ని ఆలయాలను, చర్చిలను, ప్రఖ్యాత కట్టడాలను కూల్చివేస్తున్న సమయంలో ఈ మసీదు కూడా పాక్షికంగా ధ్వంసం అయ్యింది. అయితే తాజాగా కొత్త మసీదును కూల్చాలన్న ప్రభుత్వం ఆలోచనపై హుయ్ ముస్లింలు భగ్గుమన్నారు.రెండేళ్లుగా ఈ మసీదును కడుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అడ్డుచెప్పలేదని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే చైనాలో 20 మిలియన్ ముస్లింలు ఉన్నట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.