ప్రధానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన: అట్టుడుకుతున్న రాజధాని: రోజురోజుకూ ఆందోళన బలోపేతం
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమౌతున్నాయి. కొద్దిరోజుల కిందట కొద్దిమందితో ఆరంభమైన ఈ నిరసన ప్రదర్శనలు రోజురోజుకూ బలోపేతమౌతున్నాయి. నెతన్యాహు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న ఆందోళనకారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రెట్టింపు అవుతోంది. ఆయనకు వ్యతిరేకంగా టెల్ అవీవ్లో రాజుకున్న నిరసన ప్రదర్శనలు క్రమంగా సెంట్రల్ జెరూసలెం వరకూ పాకుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో బెంజమిన్ నెతన్యాహు ఘోరంగా విఫలం అయ్యారనేది ఆందోళనకారుల ప్రధాన ఆరోపణ.
కరోనా వైరస్ బారిన పడి వేలాదిమంది ప్రజలు అల్లాడుతున్నప్పటికీ.. దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నెతన్యాహు తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. టెల్ అవివ్ సమీపంలో గల నెతన్యాహు అనధికారిక నివాసం వద్ద మొదట్లో ఆరంభమైన ఈ నిరసన జ్వాలలు క్రమంగా సెంట్రల్ జెరూసలేం వరకూ వ్యాపించాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సెంట్రల్ జెరూసలేంలోని నెతన్యాహు అధికారిక నివాసం వద్ద 10 వేల మందికి పైగా నిరసనకారులు బైఠాయించారు. ఆందోళనలను చేపట్టారు.
నెతన్యాహు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారి నినాదాలతో సెంట్రల్ జెరూసలెం మారుమోగిపోతోంది. ఆందోళనలు తీవ్రతరం అవుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారుల్లో నలుగురిని అరెస్టు చేశారు. నెతన్యాహు నివాసానికి గస్తీ కాస్తోన్న భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడానికి ప్రయత్నించిన మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఆందోళనలను కొత్త ప్రాంతాలకు విస్తరింపజేయకుండా నిరోధించడానికి పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలంలో మోహరించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి ప్రయత్నించిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
Recommended Video
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేయడానికి ప్రయత్నించిన మరి కొందరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెతన్యాహుపై ఇదివరకే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని, అప్పటి నుంచీ ఆయన నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో కరోనా వైరస్ విస్తరించడం, దాన్ని సకాలంలో నియంత్రించడంలో నెతన్యాహు విఫలం అయ్యారంటూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలకు పూనుకుంటున్నారని స్థానిక మీడియా చెబుతుంది.