లండన్కు రైతుల మహోద్యమం: వేలాదిమందితో ర్యాలీ: భారత హైకమిషన్ కార్యాలయం ముట్టడి
లండన్: మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారత్లో రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు విదేశాల్లో మద్దతు పెరుగుతోంది. రైతాంగ నిరసనల ఉద్యమం లండన్ వరకూ పాకింది. ఇప్పటికే కెనడా తన గళాన్ని వినిపించింది. ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో స్వయంగా.. రైతన్నలకు అండగా నిలిచారు. ఈ సారి బ్రిటన్లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు నిరసన బాట చేపట్టారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వేలాదిమంది నిరసన ప్రదర్శనలను చేపట్టారు. భారత హైకమిషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా లండన్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా లండన్లోని సిక్కులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వేలాదిమంది రోడ్ల మీదికి వచ్చారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. పంజాబ్ రైతులకు తాము మద్దతు ఇస్తున్నామంటూ నినదించారు. కార్లు, బైకులు, ఇతర వాహనాల ద్వారా వారంతా నిరసన ప్రదర్శనలను చేపట్టారు.
లండన్ నడిబొడ్డున ఆల్డ్విచ్ ప్రాంతంలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ఈ నిరసన ప్రదర్శనలకు సారథ్యాన్ని వహించింది. అనంతరం భారత హైకమిషన్ కార్యాలయం వద్ద బైఠాయించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. లండన్ సహా బ్రిటన్ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి.
Recommended Video
ఈ నిబంధనల ప్రకారం మాస్కులు, ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. నిరసన ప్రదర్శనలపై నిషేధం విధించారు. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా లండన్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారికి జరిమానాలను విధించారు. 4000 మందికి పైగా సిక్కులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని, వారంతా 700ల వాహనాల ద్వారా భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నారని లండన్ పోలీసులు వెల్లడించారు. 13 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.