యూకేలో మూడు వరుస పేలుళ్లు...ఎక్కడ జరిగాయంటే..?
యూకే: శ్రీలంకలో బాంబు పేలుళ్ల నుంచి ఇంకా తేరుకోకముందే యునైటెడ్ కింగ్డమ్లో వరుస పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ దేశంలోనే అతిపెద్ద టాటా స్టీల్ ఫ్యాక్టరీలో వరుసగా మూడు పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 3 గంటల 35 నిమిషాలకు పోర్టు తాల్బట్ దగ్గర తొలి పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే పేలుళ్లు జరిగాయన్న విషయం తమకు తెలుసని సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం అక్కడ అత్యవసర సేవలను అందిస్తున్నామని ఘటనకు సంబంధించి సమాచారంను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. ఉదయం 3 గంటల 35 నిమిషాలకు పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు చెప్పిన పోలీసులు పేలుడు ధాటికి ఇద్దిరికి గాయాలు అయినట్లు తెలిపారు. ఇక పేలుళ్లు సంభవించడంతో ప్లాంట్లో మంటలు చెలరేగినట్లు టాటా స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం లిక్విడ్ ఐరన్ లీకేజీ కారణంగానే పేలుళ్లు జరిగి ఉంటాయనే అంచనాకు వచ్చారు. పేలుడు జరగడంతో మంటలు వ్యాపించాయని స్పష్టం చేశారు. ఘటనలో కొన్ని భవంతులు ధ్వంసం అయినట్లు తెలిపారు.