మసీదు కాల్పులు : 49కి చేరిన మృతుల సంఖ్య, ఆస్ట్రేలియాకు చెందిన నిందితుడు అరెస్ట్
వెల్లింగ్ టన్ : క్రిస్ట్ చర్చ్, లీన్ వుడు మసీదుల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 49కి చేరింది. దాదాపు 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల పేర్కొన్నాయి. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ చనిపోయిన వారి సంఖ్యను ధ్రువీకరించారు. న్యూజిలాండ్ కాలామానం ప్రకారం మధ్యాహ్నం రెండు చర్చిల్లో సాయుధలైన దుండగులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే.
ఉగ్రవాద దాడే ..?
మసీదుల్లో జరిపిన కాల్పులు ఉగ్రవాదులని అర్థమవుతోందన్నారు ఆర్డెన్. శుక్రవారం రోజున .. ముస్లీంలు ప్రార్థనలు చేస్తూ గుమిగూడిన నేపథ్యంలో పక్కా ప్రణాళికతో దాడికి తెగబడ్డారని ఆయన వివరించారు. దాడికి పాల్పడిన నలుగురిని ఇప్పటికే భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. వీరిలో ముగ్గురికి కాల్పులతో సంబంధం ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు బ్రెంటన్ టారాంట్ (28) తనది ఆస్ట్రేలియా అని చెప్పాడని పేర్కొన్నారు. వారి వద్ద రెండు కారు బాంబులు లభించాయని .. వాటిని రక్షణశాఖ వర్గాలు నిర్వీర్యం చేశాయని తెలిపారు.
కూకటివేళ్లతో అణచివేస్తాం
తీవ్రవాద భావజాలంతో ఉన్న వీరికి న్యూజిలాండ్ లో కాదు ... ప్రపంచంలో జీవించే అర్హత లేదన్నారు ఆర్డెన్. తమ దేశంలోని పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసింది వీరు కాకుండా .. మరోకరు అని అనుమానించే పరిస్థితి లేదని చెప్పారు. కాల్పులకు సంబంధించి నిఘా వర్గాలు, పోలీసులు తగిన సమాచారం అందించారని పేర్కొన్నారు. అలాగే క్రిస్ట్ చర్చ్, దేశంలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ... బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే మసీదులన్నీ మూసివేయాలని .. తిరిగి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేవరకు వాటిని క్లోజ్ చేయాలని స్పష్టంచేశారాయన.
అనుమానాస్పదంగా కనిపిస్తే 111కి కాల్ చేయండి
తమ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే 111 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఇటు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్న వీడియోను షేర్ చేయొద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. శుక్రవారం జరిగిన కాల్పుల ఘటన న్యూజిలాండ్ కు చీకటి రోజున అభివర్ణించారు ప్రధాని ఆర్డెన్. దేశంలో తీవ్రవాదానికి తావులేదని .. తీవ్రవాద భావజాలంతో హింసను ప్రేరేపిస్తే చూస్తూ ఊరుకోమని తేల్చిచెప్పారు. దేశంలో ఉగ్రవాదానికి చోటు లేదని .. కూకటివేళ్లతో అణచివేసేందుకు చర్యలు చేపడుతామని స్పష్టంచేశారు.
ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?
సోషల్ మీడియాలో లైవ్
మసీదులో విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ఆస్ట్రేలియాకు చెందిన దుండగుడు .. తాను చేసిన దురాగతాన్ని సామాజిక మాధ్యమంలో లైవ్ పోస్టు చేశాడు. అది దాదాపు 17 నిమిషాలు అలానే ఉంది. ఆ వ్యక్తిని పోలీసులు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారాంట్ (28)గా గుర్తించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చూసి పోలీసులు అలర్టయ్యారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, ట్విట్టర్ యాజమాన్యాలకు ఫిర్యాదు చేయడంతో .. వారు వెంటనే వీడియోను డిలేట్ చేశారు. కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్ తమ అకౌంట్ లో బ్రెంటన్ అనే పేరుగల వ్యక్తి ఖాతాను రద్దుచేసింది.