స్టూడెంట్ వీసా మోసం: ముగ్గురు ఎన్నారైలకు జైలు శిక్ష
న్యూయార్క్: ఏడు మిలియన్ డాలర్ల స్టూడెంట్ వీసా మోసం కేసులో దోషులుగా తేలిన ముగ్గురు ఎన్నారైలను అమెరికాలోని మాన్హాట్టన్ కోర్టు శిక్ష విధించింది. సుమారు 7.4 మిలియన్ డాలర్ల వీసా కుంభకోణంలో సురేష్ హిరనానందనే, లలిత్ చాబ్రియా, అనితా చాబ్రియాలను దోషులుగా తేల్చుతూ కోర్టు జడ్జి పాల్ ఓట్కన్ తీర్పునిచ్చారు.
హిరనానందనే, లలిత్ చాబ్రియాలకు సంవత్సరం ఒకరోజు (అంటే 366 రోజులు) జైలు శిక్ష విధించగా అనితకు ఆరు నెలల గృహ నిర్బంధం విధిస్తూ తీర్పు వెలువరించారు. ‘‘సురేష్ హిరనానందనే, లలిత్ చాబ్రియా, అనితా చాబ్రియాలు ముగ్గురూ స్టూడెంట్ వీసా ప్రోగ్రాం పేరుతో దేశ ఆర్థిక గ్రాంటులను దోచుకున్నారు. వీరంతా కలిసి నేరానికి పాల్పడ్డారు'' అని యుఎస్ అటార్నీ ప్రీత్ బరారా పేర్కొన్నారు.
స్టూడెంట్ వీసాల పేరుతో వీరు 7.4 మిలియన్ డాలర్లు దోచుకున్నారు. దీంతో వీరిపై ఆరోపణలు రుజువు కావడంతో స్టూడెంట్ వీసా మోసం కింద నష్ట పరిహారంగా మిలియన్ డాలర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కు తిరిగి చెల్లించారు.
స్థానిక జిల్లా కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం వీరు ముగ్గురు కలిపి మైక్రో పవర్ కెరీర్ ఇనిస్టిట్యూట్(ఎంసీఐ), ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్(ఐహెచ్ఈ)లను నిర్వహిస్తున్నారు. ఈ రెండూ ఇనిస్టిట్యూట్లు ఒకేషనల్, లాంగ్వేజ్ తదితర క్లాసులను నిర్వహిస్తున్నాయి.
ఈ ఇనిస్టిట్యూట్లో చెప్పే క్లాసులకు సంబంధించి కొంత మొత్తాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెల్లిస్తోంది. అయితే ఈ ఇనిస్టిట్యూట్లలో చేరేందుకు వచ్చిన విదేశీ విద్యార్ధులను స్టూడెంట్ వీసాల ఆధారంగా చేర్చుకుంటారు. ఇక్కడే వీసాల మోసం చోటు చేసుకుంది.
ఇది ఇలా ఉంటే హిరనానందనే ఎంసీఐ ప్రెసిడెంట్ కాగా, అతని బావమరిది లలిత్ ఎంసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఐహెచ్ఈ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. హిరనానందనే సోదరి, లలిత్ భార్య అయిన అనిత ఎంసీఐ వైస్ ప్రెసిడెంట్, అలాగే న్యూయార్క్ మినియోలాలోని ఎంసీఐ మినియోలా క్యాంపస్కు డైరెక్టర్గా ఉన్నారు.